చిగురుమామిడి/గంగాధర, మే 31: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం,వాటి అనువర్తన అనే అంశంపై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అందిస్తున్న శిక్షణకు జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్, ముదిమాణిక్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ మహమ్మద్ ఖలీలోద్దీన్, గంగాధర మండలం గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మోతె జగదీశ్వర్రెడ్డి ఇస్రో శిక్షణకు ఎంపికయ్యారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) ఆధ్వర్యంలో 31 నుంచి జూన్ 4 వరకు ఆన్లైన్లో ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, అనువర్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణం, శీతోష్ణస్థితిపై అధ్యయనంలో శిక్షణ అందించనున్నారు. దేశ వ్యాప్తంగా 8585 మంది ఉపాధ్యాయులు ఎంపికకాగా, శిక్షణ కోసం వీరంతా మే 30లోగా దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం జరిగిన ప్రారంభ తరగతుల్లో ఐఐఆర్ఎస్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.పూనమ్ తివారి, వీఎస్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్ పాల్గొన్నారని, మొదటి రోజు రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్, గగన్యాన్ శాటిలైట్, చంద్రయాన్-1 మిషన్ గురించి వివరించినట్లు వారు తెలిపారు. 5 రోజుల తర్వాత సర్టిఫికెట్ను అందజేస్తారని పేర్కొన్నారు. ఇస్రో శిక్షణకు జిల్లా నుంచి ఉపాధ్యాయులు ఎంపికవడంపై పలువురు అభినందనలు తెలిపారు.