ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.25కోట్లతో బీటీ రోడ్లు మంజూరు
సత్తుపల్లి, మే 31 : రైతుల కోసం గ్రామాల మధ్య అంతర్గత రోడ్లను బీటీ రోడ్లుగా మార్చి గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని సిద్ధారంలో ఏ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాలకు పీఎంజీఎస్వై నిధుల కింద రూ.25కోట్ల వ్యయంతో 35కిలోమీటర్ల పొడవునా బీటీ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన పంచాయతీరాజ్శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే మంత్రిచే ఈ బీటీ రోడ్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. వర్షాకాలం పంటసాగు మొదలవుతున్న తరుణంలో గ్రామాల్లో రైతులకు స్వల్ప ఇబ్బందులు ఎదురవచ్చని, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న పనులకు రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. బీటీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మండలంలో రూ.17.86కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం శంకుస్థాపనచేశారు. మండల పరిధిలోని రేజర్ల నుంచి తాళ్లమడ వయా సిద్ధారం-నారాయణపురం గ్రామాల మధ్య 10.30 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ అంతర్గత రహదారి గ్రామాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ పనుల కోసం నిత్యం పొలాలకు వెళ్లే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని, అవసరమైన చోట్ల బ్రిడ్జిలు నిర్మించి రైతుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కృషిచేస్తామన్నారు. మిగిలిన మండలాల్లో సైతం మంజూరైన బీటీ రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ నళినిమోహన్, ఏఈ వెంకటేశ్వర్లు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, నాయకులు మోరంపూడి ప్రసాద్, ప్రభాకర్, కంచర్ల రమేశ్, సత్యనారాయణ, మట్టా ప్రసాద్, గోగులమూడి బాలాజీరెడ్డి, వెంకటేశ్వరరావు, నల్లంటి జానకిరామ్, చల్లగుళ్ల నర్సింహారావు, ఏగోటి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.