బోథ్లో రూ 13.88 లక్షల ఆస్తి నష్టం
సర్వం కోల్పోయిన బాధిత కుటుంబం
బోథ్, ఏప్రిల్ 30: బోథ్లోని పోచమ్మగల్లి ఒకటో వార్డులో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. రూ 13.88 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధిత కుటుంబం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలింది. వివరాలిలా ఉన్నాయి. దాసరి గంగయ్య కుటుంబ సభ్యులు నాలుగైదు రోజులుగా ఆదిలాబాద్కు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలు మొత్తం వ్యాపించాయి. బయటకు పొగ వస్తున్న విషయం గమనించిన చుట్టు పక్కల వారు కేకలు వేయడంతో యువకులు అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. ఇచ్చోడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఇళ్లంతా మంటలు అంటుకోవడంతో ఫర్నిచర్, తిండిగింజలు, మంచాలు, సోఫాలు, టీవీ, బట్టలు, తదితర వస్తువులు అన్నీ కాలిబూడిదయ్యాయి. ఫైరింజన్ వచ్చే లోపలే పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న గంగయ్య కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దశరథ్ ప్రమాద స్థలానికి వెళ్లి నష్టం అంచనా వేశారు. సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎస్ఐ రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అందుగులగూడలో రెండిండ్లు..
బెజ్జూర్, ఏప్రిల్ 30 : మండలంలోని అందుగుల గూడకు చెందిన సిడాం పొట్టి, సిడాం తిరుపతికి చెందిన ఇండ్లు గురువారం రాత్రి ప్రమాదవశాత్తు కాలి పోయాయి. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇళ్లల్లో మంటలు రావడంతో చప్పుడుకు బయట పడుకొని ఉన్న కుటుంబ సభ్యులు నిద్రలేచారు. గ్రామస్తుల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రెండు ఇండ్లు కాలి బూడిదయ్యాయి. ఇండ్లలో ఉన్న వెండి ఆభరణాలు, రూ. 30 వేలతో పాటు వ్యవసాయ, నిత్యావసర వస్తువులు కాలి పోయినట్లు బాధితులు తెలిపారు. దీంతో పొట్టికి సుమారు రెండు రూ. లక్షల వరకు, తిరుపతికి సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. సమీపంలో ఉన్న పొట్టి ఎద్దుకు కూడా మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్ఐ రాథోడ్ రాంసింగ్ పంచనామా చేశారు. పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించనున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.