సంగారెడ్డి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పేదలు, సబ్బండవర్ణాల ప్రజలు టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలను పొందుతూ సంతోషంగా జీవిస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందని కుటుంబం అంటూ ఉండదు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏదో ఒకవిధంగా లబ్ధి చేకూరింది. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, దళితులకు భూ పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి పథకాలు లబ్ధిదారులకు వరంగా మారాయి. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యతిస్తున్నది.
పంట రుణమాఫీ పథకంలో ప్రభుత్వం రూ.50వేల రుణాలు మాఫీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలోని 29,064 మంది రైతులకు రూ.98.10కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.
రైతుబీమా పథకంలో ఒక్కొక్కరి రూ.5 లక్షల చొప్పున బీమాను వర్తింపజేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో మరణించిన 1398 మంది రైతుల నామినీ ఖాతాల్లో రూ.69.90 కోట్లు జమచేసింది.
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 17,503 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసింది.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షీక్యాబ్ పైలెట్ పథకం లో భాగంగా జిల్లాలో 18మంది మహిళా లబ్ధిదారులకు రూ1.32 కోట్లతో మారుతీ డిజైర్ వాహనాలను అందజేసింది.
ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ పథకాల ద్వారా 79.36 లక్షలు లబ్ధిదారులకు అందజేసింది. జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో 15మంది ఎస్సీ మహిళలకు రూ.22.59 లక్షలతో మూడు స్వయం ఉపాధి యూనిట్లు ప్రభుత్వం నెలకొల్పింది. ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆరుగురు ఎస్సీ లబ్ధిదారులకు రూ.26.93 లక్షల అందజేసి మొబైల్ టిఫిన్ సెంటర్ యూనిట్లు ఏర్పాటు చేయించింది.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 10,380 మంది విద్యార్థులకు రూ.13.28 కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందజేసింది. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా 30 మంది విద్యార్థులకు రూ.5.69 కోట్లు అందజేసింది.
బీసీ తరగతుల సంక్షేమం శాఖ ద్వారా 15,883 బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.15.69 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్స్ అందజేసింది. స్వయం ఉపాధి పథకం కింద 766 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.3.83 కోట్లు అందజేసింది.
నాయీబ్రాహ్మణులు, రజకులు నిర్వహించే సెలూన్లు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నది. జిల్లాలో ప్రస్తుతం 600 మందికిపైగా లబ్ధి పొందుతున్నారు.
ఈ ఏడాది కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2311 మంది లబ్ధిదారులకు రూ.23.34 కోట్లు అందజేసింది. షాదీముబారక్ పథకం ద్వారా 543 మంది లబ్ధిదారులకు రూ.5.44 కోట్లు ప్రభుత్వం సాయం చేసింది.
రంజాన్ పర్వదినం సమయంలో జిల్లాలోని 14,000 మంది ముస్లిం మైనార్టీలకు దుస్తులు పంపిణీ చేసింది. కిస్మస్ సందర్భంగా 4,000 మందికి దుస్తులు పంపిణీ చేస్తున్నది.
జిల్లాలోని 33 మంది దివ్యాంగులకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.20.80 లక్షలు అందజేసింది.
జిల్లాలోని అర్హులైన 1,38,099 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులకు ఆసరా పథకం ద్వారా పింఛన్లు అందజేస్తున్నది. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది.
డీఆర్డీఏ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 13,587 ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.508 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3,804 సంఘాలకు రూ.114.34 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
జిల్లాలోని 9,54,133 ఈత మొక్కలు నాటి 3,146 మంది గీత కార్మికులకు జీవనోపాధి కల్పించింది.
ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 175.18 కోట్లతో 2355 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేసింది.
ప్రభుత్వం దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు చేసి గరిష్టంగా మూడు ఎకరాల వరకు అందజేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 171 మంది లబ్ధిదారులకు రూ.26.31 కోట్లతో 364.39 ఎకరాల భూమిని పంపిణీ చేసింది.
రైతుబంధు…
రైతుబంధు పథకం ద్వారా ఏటా సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల మందికి పైగా రైతులకు వానకాలం, యాసంగి సీజన్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట పెట్టుబడి ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రస్తుత వానకాల సీజన్కు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 3,03,120 మంది రైతులకు రూ.366.86 కోట్ల రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది.