రేపు నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన
శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు
రూ.1700 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఉదయం 9నుంచి రాత్రి 7వరకు సుమారు 40 కార్యక్రమాలు
ఖిలావరంగల్ మైదానంలో బహిరంగ సభ
క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ వినయ్, ఎమ్మెల్యేలు
వరంగల్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉగాదికి ముందే రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగర ప్రజలకు గొప్ప కానుకలు ఇవ్వనున్నారు. ఇంటింటికి తాగునీటిని సరఫరా హామీని సాకా రం చేయనున్నారు. కార్పొరేషన్ పరిధిలో రూ.1700కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కోసం అమాత్యుడు రామన్న ఈ నెల 12న నగరానికి వస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సుమారు 40కార్యక్రమాల్లో పాల్గొనన్నుట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. ముందుగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని రాంపూర్, శాయంపేట జంక్షన్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను ప్రారంభిస్తారు. ఖిలావరంగల్లోని మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరున్నరేళ్లలో వరంగల్ మహానగరంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు.
వేగంగా పనులు
నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రారంభించే, శంకుస్థాపన చేసే ప్రాంతాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్తో కలిసి శనివారం పరిశీలించారు. మంచినీటిని సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించే రాంపూర్లోని పంప్హౌస్ను పరిశీలించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అంబేద్కర్ జంక్షన్, శాయంపేట జంక్షన్ ప్రాంతాలను చీఫ్విప్ వినయ్భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి పరిశీలించారు. పనులు వెంటనే పూర్తి కావాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, పమేలా సత్పతిని ఆదేశించారు. మహానగర ప్రజలకు ప్రతిరోజూ నీటి సరఫరా కోసం ప్రభుత్వం మిషన్ భగీరథ కింద రూ.950 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివరించారు. నగరానికి వరద ముంపు లేకుండా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఏర్పాట్ల పరిశీలన
మడికొండ/కాశీబుగ్గ : రాంపూర్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు వద్ద మంత్రి కేటీఆర్ నల్లాను ప్రారంభించనుండగా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి,ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ పరిశీలించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఆర్డీవో వాసుచంద్ర ఉన్నారు. లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్ వద్ద కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తూర్పు ఎమ్మెల్యే, కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. మార్కెట్ ప్రాంతంలో పారిశుధ్య పనులు చేపట్టాలని, కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ సీపీ డాక్టర్ తరుణ్జోషి, మార్కెట్ చైర్మన్ సదానందం, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, గ్రేడ్-2 కార్యదర్శులు కుమారస్వామి, చందర్రావు ఉన్నారు.
ఇవీ కార్యక్రమాలు
సోమవారం ఉదయం 9గంటలకు మంత్రి కేటీఆర్ నగరానికి రానున్నారు. రాత్రి ఏడు గంటల వరకు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా రాంపూర్ లో జీడబ్ల్యూఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాను ప్రా రంభిస్తారు. దేశాయిపేటలో జర్నలిస్టుల కాలనీ, దూపకుంటలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి, ఎల్బీనగర్లో షాదీఖాన, మండిబజార్లో హజ్హౌస్ పనులకు శంకుస్థాపన చేస్తారు. లక్ష్మీపురంలో పండ్ల మార్కెట్ను ప్రారంభిస్తారు. అక్కడే ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్వెజ్ మా ర్కెట్, 14 దుకాణాల సముదాయ నిర్మాణం కోసం శం కుస్థాపన చేస్తారు. ఎస్ఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు అప్పగిస్తారు. గరీబ్నగర్లో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను అందిస్తారు. సీకేఎం కాలేజీ నుం చి లేబర్ కాలనీ రోడ్డు వరకు రహదారి, సీబీసీ చర్చిలో అభివృద్ధి, శివనగర్ నుంచి మైసయ్యనగర్ వరకు స్మార్ట్ వాటర్ డ్రైన్, ఆర్ఎస్నగర్ నుంచి 12 వెంట్స్ వరకు స్మార్ట్స్ వాటర్ డ్రైన్, శివనగర్ వాటర్ ట్యాంకు నుంచి అండర్ బ్రిడ్జి వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తా రు. బట్టల బజార్ ఆర్వోబీని, శివనగర్ వద్ద ఆర్యూబీ ని ప్రారంభిస్తారు. కరీమాబాద్ ప్రాంతంలో దసరా రోడ్డు జంక్షన్ నుంచి ఉర్సు గుట్ట వరకు, కరీమాబాద్ ఫ్లైఓవర్ నుంచి గవిచర్ల రోడ్డు వరకు రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. రంగశాయిపేట ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. వరంగల్ పోర్టు రోడ్డు జంక్షన్ నుంచి నాయుడు పెట్రోలు పంపు నుంచి నాయుడు పంపు వరకు రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఖిలావరంగల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. తిమ్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లకు, తిమ్మాపూర్ నుంచి సింగారం మీదు గా బొల్లికుంట వరకు డబుల్ లైన్ రోడ్డు పనులకు, కడిపికొండ జంక్షన్, కాజీపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన చేస్తారు. నిట్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వడ్డేపల్లి చెరువు కట్ట సుందరీకరణ, సమ్మయ్యనగర్ వద్ద నాలాపై నిర్మించినవాల్, వరద నీటి డ్రైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. చింతగట్టు, వంగపహాడ్, హసన్పర్తి వద్ద డబుల్బెడ్ రూం ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. కేయూ,అంబేద్కర్ జంక్షన్ను ప్రారంభిస్తారు. ఐబీ గెస్ట్ హౌస్ వద్ద ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. పద్మా సమీపంలోని వైకుంఠధామాన్ని సందర్శిస్తారు. జైనక్షేత్రాలను, సరిగమప పార్కును ప్రా రంభిస్తారు. అక్కడే సాంస్కృతిక కేంద్రం (కల్చరల్ హబ్) పనులకు శంకుస్థాపన చేస్తారు. భద్రకాళీ బండ్ వద్ద భద్రకాళీ జియో, బయో డైవర్సిటీ పార్కును ప్రారంభిస్తారు. శాయంపేట జంక్షన్ వద్ద ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రారంభించి బహిరంగసభలో పాల్గొంటారు. సుబేదారి జంక్షన్ నుంచి పోలీసు హెడ్ క్వార్టర్ వరకు పబ్లిక్ స్పేస్ డెకరేటివ్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభిస్తారు. తర్వాత ఎన్ఐటీ నుం చి హెలికాప్టర్లో హైదరాబాద్ పయనమవుతారు.
ఇవి కూడా చదవండి
ముంబై వీధుల్లో జనాలే లేరుగా..
IPL 2021: చితక్కొట్టిన చెన్నై..ఢిల్లీకి భారీ టార్గెట్