కరోనా మృతుల అంతిమ సంస్కారాలకు భరోసా
తెలిసిన వెంటనే కదులుతున్న గ్రేటర్ కార్పొరేషన్ సిబ్బంది
అయినవాళ్లు పట్టించుకోకున్నా అన్నీతామై ఏర్పాట్లు
దహనానికి రూ.10లక్షలతో ఆధునిక యంత్రం
ఫ్రంట్లైన్ వారియర్స్కు బాధిత కుటుంబాల సెల్యూట్
వరంగల్, ఏప్రిల్ 29 : కాటికి పోయే సమయంలో కాకితో కబురంపితే వచ్చే బంధువర్గాన్ని మహమ్మారి దూరం చేసింది. కరోనాతో కాలం చేస్తే పక్కింటోడు కన్నెత్తి చూడని దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ‘గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్’ అండగా నిలుస్తున్నది. కొవిడ్ మృతుల అంతిమ సంస్కారాలను అన్నీతామై నిర్వహిస్తున్నది. తెలిసిన వెంటనే చేరుకుని ప్రాణాలను పణంగా పెట్టి మృతదేహాలను శ్మశానవాటికకు తరలిస్తూ కష్ట కాలంలో ఆత్మీయబంధువులుగా నిలుస్తున్న బల్దియా సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నది.
కరోనా సోకి చనిపోతే అయినవాళ్లే దగ్గరకు రాని పరిస్థితుల్లో దహన సంస్కారాలకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ భరోసా ఇస్తున్నది. కరోనా మృతుల అంతిమ సంస్కారాలు పెద్ద సమస్యగా మారి బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బల్దియానే ఆ బాధ్యతను భుజాన వేసుకుంది. కొవిడ్ మృతదేహాల అంత్యక్రియల కోసం గతేడాది ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అధికారులు, రూ.10లక్షలతో పోతన శ్మశానవాటికలో ఎలక్ట్రికల్ మిషన్ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వారంలో సుమారు 20 మృతదేహలకు బల్దియా సిబ్బంది దహన సంస్కారాలు చేశారు. కార్పొరేషన్లో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి చేసి రెండు వాహనాలను మృతదేహాల తరలింపు కోసం అందుబాటులో ఉంచారు. ఎంజీఎంలో మృతదేహాలను వదిలేసినట్లు, ఇళ్లలో ఎవరైనా కరోనాతో చనిపోయినట్లు సమాచారం అందిన వెంటనే సిబ్బంది స్పందిస్తున్నారు. వెంటనే వెళ్లి కరోనా మృతదేహనికి అంత్యక్రియలు చేస్తున్నారు. నగర కమిషనర్ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ వెంటవెంటనే సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు.
45 నిమిషాల్లోనే దహనం..
పోతన శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ యంత్రం ద్వారా 45 నిమిషాల్లోనే దహనం పూర్తవుతున్నది. ఇది ఎల్పీజీ గ్యాస్ ద్వారా పని చేస్తుంది. నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్క మృతదేహం దహనానికి సగం సిలిండర్ గ్యాస్ సరిపోతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ యంత్రాన్ని కరోనా మృతదేహాల దహనానికే వినియోగిస్తున్నారు.