కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
ఆసిఫాబాద్, మార్చి 15 : జిల్లాలోని ప్రజల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మొత్తంగా 50 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత విభాగాలకు బదిలీ చేస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించే పథకా లు లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా బూరుగూడ సమీపంలోని (సర్వే నంబర్97) తన భూమిలో బోర్వెల్ ధ్వంసమైందని, పరిహారం ఇప్పించాలని ఆసిఫాబాద్కు చెందిన రవికుమార్ అర్జీ పెట్టుకున్నాడు. వాంకిడి మండలంలోని రాజీవ్నగర్కు చెందిన ఎడ్ల హనుమంతు తన భూమి(సర్వే నంబర్ 299/31)కు డిజిటల్ పట్టా పాస్పుస్తకం అందించాలని కోరాడు. కాగజ్నగర్కు చెందిన అబ్దుల్ సలీం, 2018 పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందాడని, విచారణ జరిపి అర్హత గల తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. రెబ్బెన మండలం నేర్పల్లి శివారులోని 11/4, 22/2 సర్వే నంబర్లలో తన భూమికి పట్టా ఉందని, కానీ ప్రొబిటెడ్ లిస్టులో ఉండడంతో ధరణి రిజిస్ట్రేషన్ కావడంలేదని రాంచందర్ వినతి పత్రం అందజేశాడు. అర్జీదారుల సమస్యలను సావధానంగా విన్న కలెక్టర్, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.