అదనపు ఎన్నికల అధికారి, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి
వరంగల్, ఏప్రిల్ 27 : ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఎన్నికల అధికారి, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 171 మంది సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లు పంపించినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లోని నిబంధనలు చదివిన తర్వాతే ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఈ సారి 80 ఏళ్లు పైబడిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిందన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి నరేశ్కుమార్, డీఎస్వో వేణుగోపాల్, ఆర్వో కృష్ణవేణి, మాక్బూల్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీల్
అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను సీల్ చేసినట్లు గ్రేటర్ అదనపు కమిషనర్ నాగేశ్వర్ తెలిపారు. ఈ మేరకు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, సర్వీస్ ఓటర్లు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, కరోనా పాజిటివ్ బాధితులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. డివిజన్కు ఒక బాక్స్ చొప్పున 66 బాక్స్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను కౌన్సిల్ హాల్లో ఓటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్లు పోస్ట్ ద్వారా పంపించినట్లు తెలిపారు. గడువులోగా పంపితేనే ఓటును పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి విజయలక్ష్మి, నోడల్ అధికారి అశోక్కుమార్, సూపరింటెండెంట్ జాకీర్ హుస్సేన్, సీనియర్ అసిస్టెంట్లు వినయ్, సూర్యనారాయణ పాల్గొన్నారు.