పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 71 మంది
జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు
ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు 38,367 మంది..
ఎన్నికల విధుల్లో 487 మంది.. 1,050 మంది పోలీస్ సిబ్బంది
భువనగిరి, చౌటుప్పల్ నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ
వాయిలెట్ కలర్ పెన్నుతోనే ఓటేయాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల బరిలో 71 మంది నిలువగా, జిల్లాకు చెందిన 38,367 మంది పట్టభద్రులు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 34 కేంద్రాలలో నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట మైక్రో అబ్జర్వర్లను, వీడియోగ్రాఫింగ్, వెబ్కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 487 మంది సిబ్బంది పాలుపంచుకుంటుండగా.. 1,050 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. భారీ బ్యాలెట్ పేపర్ దృష్ట్యా 59 జంబో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయడంతోపాటు ముందు జాగ్రత్తగా 66 వరకు పెద్ద బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. భువనగిరి, చౌటుప్పల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో బస్సుల్లో బయలుదేరిన సిబ్బంది శనివారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అనితారామచంద్రన్, పోలింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని.. వాయిలెట్ కలర్ పెన్నుతోనే ఓటేయాలని సూచించారు.
జిల్లాలో ఆదివారం జరగనున్న నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఎన్నిక సామగ్రి పంపిణీ కోసం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, చౌటుప్పల్లోని సాన్జాన్ విద్యానికేతన్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు కలెక్టర్లు గరీమాఅగర్వాల్, కీమ్యానాయక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించి పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని సరిచూసుకుని సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. సిబ్బందిని తరలించేందుకు 15 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ఒక బస్సును కూడా అందుబాటులో ఉంచారు. ఎన్నికల బరిలో 71 మంది నిలువగా.. ఆదివారం జరిగే పోలింగ్లో 25,041 మంది పురుషులు, 13,321 మంది స్త్రీలు, ఇతరులు ఐదుగురు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలోని 54 పోలిం గ్ కేంద్రాల్లో 59 జంబో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయడంతోపాటు రిజర్వులో మరో 5 బాక్సులు ఉంచారు. అలాగే 66 పెద్ద బాక్కులు ఏర్పాటుచేయగా.. ముందు జాగ్రత్తగా మరో 12 పెద్ద బాక్సులను అందుబాటులో ఉంచారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా
ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్శాఖ చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలోని 28 పోలింగ్ కేంద్రాల వద్ద, మరో రెండు మండలాల పరిధిలోని 6 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. 20 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో పరిశీలకులను ఏర్పాటు చేయగా.. ఐదు పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీని, మరో 29 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. బ్యాలెట్ వెరిఫికేషన్ కోసం 20 మందితో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి మండలానికి ఫ్లైయింగ్ స్కాడ్ టీం, వీడియోగ్రఫీ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం, వెబ్కాస్టింగ్ టీంలను ఏర్పాటు చేశారు. 8 రూట్లలో పర్యవేక్షణ కోసం 17 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. పోలింగ్ అనంతరం బాక్స్లను భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, చౌటుప్పల్లోని సాన్జాన్ విద్యానికేతన్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపర్చనున్నారు. ఈనెల 17న నల్లగొండలో కౌంటింగ్ జరగనున్నది.
తొమ్మిది గుర్తింపు కార్డులకు అనుమతి
జిల్లా యంత్రాంగం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. వృద్ధులు, కరోనా అనుమానితులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. అయితే పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకునేవారు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. తొమ్మిది రకాల గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, యూనివర్శిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పకుండా ఉండాలి.
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, చౌటుప్పల్లోని సాన్జాన్ విద్యానికేతన్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను శనివారం అదనపు కలెక్టర్లు గరీమాఅగర్వాల్, కీమ్యానాయక్తో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. జంబో బ్యాలెట్ బాక్సులు, పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తున్నందున పోలింగ్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బంది ఓటర్లకు వాయిలెట్ కలర్ పెన్ను అందజేయాలని, ఓటర్లు బ్యాలెట్ పేపరుపై అక్షరాలు రాయకుండా ప్రాధాన్యతా క్రమంలో అంకె వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీస్శాఖ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.