2,20,300 మంది ఓటర్లు.. 346 పోలింగ్ కేంద్రాలు
విధుల్లో 3,145 మంది సిబ్బంది.. 2,390 మంది పోలీసులు
హాలియాలో ఎన్నికల సామగ్రి
పంపిణీకి ఏర్పాట్లు
రేపు సాగర్ నియోజకవర్గంలో సెలవు
పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి :
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
బయటి వ్యక్తులు సాగర్లో ఉండొద్దు : ఎస్పీ రంగనాథ్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి శనివారం జరుగబోయే పోలింగ్పైనే కేంద్రీకృతమైంది. ఇన్ని రోజులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్న అభ్యర్థులు, ప్రధాన పార్టీల నేతలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించగా.. జిల్లా అధికార యంత్రాంగం
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 346 కేంద్రాల్లో శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ సాగనున్నది. ఆయా కేంద్రాలకు ఇప్పటికే సిబ్బందిని ర్యాండమైజేషన్ ప్రక్రియలో నియమించారు. హాలియాలోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. సాయంత్రానికి సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ కోసం 3,145 మంది సిబ్బంది, బందోబస్తుకు 2,390 మంది పోలీసులు విధుల్లో ఉంటారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీజే పాటిల్ తెలిపారు.
విధుల్లో 5535 మంది సిబ్బంది..
పోలింగ్, పోలీస్ సిబ్బంది కలిపి మొత్తం 5535మంది పోలింగ్ విధుల్లో పాల్పంచుకోనున్నారు. వీరందరికీ ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరికి శుక్రవారం హాలియాలో పోలింగ్ సామగ్రిని అప్పగించనున్నారు. అక్కడ ఐటీఐ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రంలో ఉదయం 8గంటలకు పంపిణీ ప్రారంభం కానుంది. ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయించిన విధులకు అనుగుణంగా పోలింగ్ సిబ్బంది హాజరుకావాల్సి ఉంటుంది. వీరు పోలింగ్ సామగ్రితో సహా తమకు కేటాయించిన కేంద్రాలకు నేటి సాయంత్రానికి చేరుకుంటారు. పోలింగ్ సిబ్బందిలో పోలింగ్ స్టాఫ్ 1622, మైక్రో అబ్జర్వర్లు 130, వెబ్ కాస్టింగ్ 210, సెక్టార్ ఆఫీసర్లు44, రూట్ ఆఫీసర్లు 44, బీఎల్ఓలు 293, వైద్య సిబ్బంది 710మంది, మరో 95మంది డ్రైవర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక పోలీసు సిబ్బందికి సంబంధించి ఇప్పటికే కేంద్ర పారా మిలటరీ బలగాలు, సీఐఎస్ఎఫ్ బలగాలు కూడా జిల్లాకు చేరుకున్నాయి. స్థానిక పోలీసులు 1050 మంది, ఇతర జిల్లాలకు చెందిన వారు 1000, సీఐఎస్ఎఫ్ 3కంపెనీలకు చెందిన 290మంది, స్టేట్ స్పెషల్ పోలీసులు 50మంది ఉన్నారు. వీరంతా నేటి సాయంత్రం విధుల్లో చేరనున్నారు. ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు. నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు నడుచుకోవాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
నల్లగొండలో ఓట్ల లెక్కింపు…
ఓట్ల లెక్కింపు ప్రక్రియను నల్లగొండలోని ఆర్జాలబావి పరిధిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. శనివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను నేరుగా నల్లగొండకు తరలించనున్నారు. ఇప్పటికే విభజించిన రూట్లలో వీటిని పటిష్ట బందోబస్తు నడుమ తీసుకువస్తారు. ఇక్కడ రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేసి ఈవీఎంలను భద్రపరుస్తారు. దీని కోసం ప్రత్యేక భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2న ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం వెల్లడించనున్నారు.
రేపు నియోజకవర్గం మొత్తం సెలవు..
ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 17న నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి, కార్మిక శాఖ ఆదేశాల మేరకు అన్ని కర్మాగారాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు. పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకే ముగియాల్సి ఉన్నా… కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో ఏడు గంటల వరకు పొడిగించారు. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ రాత్రి ఏడు గంటల వరకు 12గంటల పాటు కొనసాగనుంది. కొవిడ్ నేపథ్యంలో క్యూలైన్లలో భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్ల ఏర్పాటు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో పాటు సాయంత్రం ఆరు గంటల తర్వాత కొవిడ్ పేషెంట్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఓటర్లు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.