ప్రతి సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి
ఎస్పీ అపూర్వరావు
వనపర్తి, ఏప్రిల్ 22 : జిల్లాలో పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కార దిశగా బాధ్యతగా ఆయా మండలాల పోలీస్ సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, రోజు వారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మాస్కు ధరించకుండా రోడ్లపై తిరిగే వారికి రూ.వెయ్యి జరిమానాను ఈ ఛలాన్ ద్వారా విధించాలని ఆదేశించారు. అనంతరం పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని, అదేవిధంగా మాస్కులు ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తూ తమ విధులకు హాజరుకావాలని సూచించారు. 5సీ సిస్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని కేసుల ఫైళ్లను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గుట్కా, మట్కా , బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏఎస్పీ షాకీర్హుస్సేన్, డీసీఆర్బి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు జములప్ప, శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు తదితరులు తమ పోలీస్ స్టేషన్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్కు పాల్గొన్నారు.