కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సమాయత్తమైన యంత్రాంగం
పల్లెల్లో భారీగా పరీక్షలు
వ్యాక్సిన్పై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు
కొన్నిచోట్ల స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్న గ్రామస్తులు
స్వీయరక్షణతోనే మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమంటున్న అధికారులు
అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచన
ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు
వ్యాక్సిన్ కేంద్రాల ముందు పెరుగుతున్న బారులు
వికారాబాద్, మార్చి 22, (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నది. ఒకపక్క స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి పల్లెల్లో టీకాల ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు యత్నిస్తున్నారు. దీంతోపాటు పల్లెల్లోనూ టెస్టులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఉపాధి కూలీలతో పాటు ప్రజలందరికీ ఏమాత్రం లక్షణాలున్నా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు టీకాల కొరత లేదని, ఆధార్ కార్డు తీసుకుని వచ్చి 45 ఏండ్లకు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రజలే తీర్మానం చేసుకొని స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. కేసులు పెరుగడంతో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యనూ పెంచారు. ప్రభుత్వం తీసుకున్న చొరవతో ప్రజల్లో అవగాహన పెరుగడంతో టెస్టులు చేయించుకునే వారితో పాటు వ్యాక్సిన్ల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది.
కరోనా సెంకడ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడి చేయడానికి జిల్లా యంత్రాంగం అంతే వేగంగా పని చేస్తున్నది. జిల్లాలోని ప్రజలందరూ టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉపాధి కూలీలతో పాటు పల్లె ప్రజలకు సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఎస్కే (రాష్ట్రీయ బాల స్వస్థ) కు సంబంధించిన వాహనాలన్నీ జిల్లాలోని 18 మండలాల్లోని 566 పంచాయతీల్లో సేవలందిస్తున్నాయి. పల్లెలకు చేరుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 వాహనాల్లో బృందాలు పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాయి.
టీకా స్వీకరణ 40వేలు..
45 ఏండ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు లక్ష్యం దిశగా వెళ్తున్నారు. జిల్లాలో టీకా కొరత లేదని, ప్రజలందరూ వాక్సిన్ వేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. 45 ఏండ్లకు పైబడిన వారు ఆధార్ కార్డు తీసుకుని, పీహెచ్సీలకు వెళ్లాలని డాక్టర్లు పేర్కొంటున్నారు. జిల్లాలో 45 ఏండ్లు దాటిన వారు 2 లక్షలకు పైగా ఉంటే ఇప్పటి వరకు 45వేల మందికి టీకాలు వేశారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు సీహెచ్సీ, తాండూరు జిల్లా దవాఖాన 1, ఇక్కడే పీపీయూ కేంద్రాల్లో వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
కమిటీలకు బాధ్యతలు..
టీకా విషయంలో వెనుకంజ వేస్తున్న వారిని చైతన్యం చేసి టీకా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మండలాల వారీగా ఎంపీవోలు, తహసీల్దార్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరోగ్య, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను చేర్చారు. వీరంతా మండల పరిధిలో ఉండే అర్హులకు వ్యాక్సిన్ వేయించే పనిలో ఉన్నారు. అలాగే టెస్టులు చేసుకోవడంలోనూ ప్రజలను ప్రోత్సహించాలి.
10 వాహనాల్లో బృందాలు..
ఆర్బీఎస్కేకు చెందిన 10 వాహనాల్లో వైద్య బృందాలు జిల్లాలోని 18 మండలాల్లోని పల్లె ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి వెళ్తున్నాయి. వీరు తమ మండల పరిధిలోని ఆయా గ్రామాలకు వంతుల వారీగా వెళ్తూ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. 8900 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఒక్కో వాహనంలో వైద్యాధికారి, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు వెంటనే మందులు అందచేసి తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. జాగ్రత్తే.. శ్రీరామ రక్ష.. అని జిల్లా యంత్రాంగం ప్రజలకు పిలుపునిస్తున్నది.
ఇవి కూడా చదవండి
మోదీకి చిరంజీవి చురకలు.. నిర్ణయాన్ని మార్చుకోమని సలహా
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల