66 డివిజన్లు.. 6,53,240మంది ఓటర్లు
878 పోలింగ్ కేంద్రాలు, 4,390 మంది సిబ్బంది
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
కేంద్రాలకు సామగ్రితో చేరిన సిబ్బంది
3,736 మంది పోలీసులతో బందోబస్తు
కరోనా నిబంధనలు పక్కాగా అమలు
‘గ్రేటర్’లో 144సెక్షన్ అమలు
వరంగల్, ఏప్రిల్ 29 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 66 డివిజన్లలోని 878 కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుండగా సిబ్బందిని గురువారమే సామగ్రితో ఆయా సెంటర్లకు తరలించింది. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి 500మంది బరిలో ఉండగా 6,53,240మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నేడు గ్రేటర్ పరిధిలో 144సెక్షన్ అమలులో ఉండగా, 3,736 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ నగరవాసులు ఓటింగ్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఓరుగల్లు ‘మహా’ సంగ్రామానికి అంతా సిద్ధమైంది. శుక్రవారం గ్రేటర్ కార్పొరేషన్లోని 66 డివిజన్లలో పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ సజావుగా సాగేందుకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. 878 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఆర్ట్స్కళాశాల, నిట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ సెంటర్ల నుంచి సిబ్బంది 420 బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు గురువారం తరలివెళ్లారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. మాస్కు లేకుండా ఓటు వేసేందుకు వచ్చే వారిని అనుమతించ కూడదని ఆదేశాలు జారీ చేశారు. 3500మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
6,53,240 మంది ఓటర్లు
గ్రేటర్లోని 66 డివిజన్లలో 6,53,240 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోనున్నారు. వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా 500 మంది బరిలో నిలిచారు. 4390 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 745మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. 1221 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. 44 మంది సెక్టోరియల్ అధికారులను, 81 మంది రిటర్నింగ్ అధికారులను, 81 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బందిని నియమించారు. 529 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 45 అతి సమస్యాత్మక కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 323 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల గదులను శానిటైజ్ చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. వృద్ధుల కోసం ర్యాంపులు నిర్మించారు. దివ్యాంగులకు వీల్ చైర్లను అందుబాటులో ఉంచారు. ఎండాకాలం కావడంలో ప్రత్యేకంగా టెంట్లు వేశారు. కుర్చీలు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులకు సహాయం చేసేందుకు వలంటీర్లను నియమించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి సామగ్రితో పాటు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించారు. 14వేల ఎన్95 మాస్కులు, 10 వేల త్రీ లేయర్ మాస్కులు 14 వేల నెట్రోజెన్ గ్లౌజులు, 14వేల ఫేస్ షీల్డ్స్, 1400 లీటర్ల శానిటైజర్ను కొనుగోలు చేసి సిబ్బందికి పంపిణీ చేశారు.
భారీ బందోబస్తు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 3,736 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ను 31 సెక్టార్లుగా విభజించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 44 రూట్లలో 4 స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్, 5 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు కల్పిస్తున్నారు.