గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్
లోకారి(కే)లో గ్రామస్తులకు అవగాహన
నార్నూర్,మే 3: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పేర్కొన్నారు. గాదిగూడ మండలంలోని లోకారి(కే) గ్రామంలో సోమవారం కొవిడ్ నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్కు ధరించాలని సూచించారు. భౌతికదూరం పాటించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మాస్కు లేకుంటే జరిమానా..
ఆదిలాబాద్ రూరల్, మే 3: పట్టణంలో వ్యాపారం చేసే వారు, వినియోగదారులు ఎవరైనా సరే మాస్కు లేకుండా ఉంటే జరిమానా విధిస్తామని టీపీబీవో సాయికుమార్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్లోని వ్యాపార సముదాయాల్లో తనిఖీలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించని వ్యాపారులకు రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ శైలజ ఆదేశాల మేరకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీపీఎస్ అనురాధ, సిబ్బంది రఫీక్, రాజేశ్వర్, శివ, నర్సింహులు, రవి, తదితరులు పాల్గొన్నారు.