ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ విగ్రహాలకు పూలమాలలు
అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మంత్రులు..
కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకొని ఆనందం
ఉద్యమ ప్రస్థానాన్ని నెమరేసుకున్న నాయకులు
తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్ : మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్
హన్మకొండ, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుక మంగళవారం కనులపండువలా జరిగింది. ఊరూరా గులాబీ జెండాల రెపరెపలతో ఉమ్మడి జిల్లా పులకించింది. పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయాచోట్ల జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్, కాళోజీ విగ్రహాలు, అమరవీరుల స్తూపాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి.. ఉద్యమంలో టీఆర్ఎస్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఉద్యమకారులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఘనంగా సన్మానించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదాలత్ సెంటర్లో స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నాడు మహాత్మాగాంధీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే.. తెలంగాణకు వ్యతిరేకుల నుంచి విముక్తి కల్పించి స్వరాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్ ‘తెలంగాణ గాంధీ’ అని మంత్రి ఎర్రబెల్లి అభివర్ణించారు. అనంతరం అక్కడే టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముఖ్య నేతలు, ఉద్యమకారులను మంత్రులు శాలువాతో సన్మానించి ఆనాటి పోరాట పటిమను గుర్తుచేసుకున్నారు. ఏకశిలా పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, కాళోజీ సెంటర్లోని కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హంటర్రోడ్డులోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేసి గాలిలోకి గులాబీ బెలూన్లు వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నదన్నారు. వరంగల్లో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా విరమించుకొని ఆర్భాటం లేకుండా వేడుకలు నిర్వహించామని చెప్పారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణను సాధించుకున్నామో ఆ లక్ష్యం మేరకు రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంతోషంగా ఉండేలా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నాడని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో వరంగల్ కీలక పాత్ర పోషించిందని, అందులో తాము ఉండడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ఉద్యమకారులకు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, రాష్ట్ర ప్రగతికి గులాబీ జెండా అండగా నిలుస్తుందన్నారు. స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. కేసీఆర్ ఆమరణ దీక్ష, ప్రజల మద్దతుతో అనుకున్న లక్ష్యం సాకారమైందన్నారు. పాలనలో కొత్త పుంతలు తొక్కడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాలు పెట్టిన ధీరుడు కేసీఆర్ అని పల్లా రాజేశ్వర్రెడ్డి అభివర్ణించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, జన్ను జకార్య పాల్గొన్నారు.