ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 23 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పలు వార్డుల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతోనే పట్టణం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో వేల కోట్ల నిధులతో మున్సిపాలిటీ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దని టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టితో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నడికుడి ఉమారాణి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, తరాల బలరాములు, నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, మాద నగేశ్ పాల్గొన్నారు.