ఫలించిన ఎంపీ రంజిత్రెడ్డి నిరంతర కృషి
జిల్లా అంశంపై పార్లమెంట్లో ప్రస్తావన
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే హామీ నెరవేరింది
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు
చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి
వికారాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరింది. జోన్ మార్పుపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25, మే 2018 రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అప్పటి వరకు హైదరాబాద్ 6వ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను కొత్తగా ఏర్పాటైన జోగుళాంబ జోన్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్లో కలుపుతామని సీఎంతో పాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ కృషితో వికారాబాద్ను చార్మినార్ జోన్లో కలుపుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదంతో.. సోమవారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని జోన్లని ప్రకటిస్తూ రాజపత్రాన్ని విడుదల చేసింది.
వికారాబాద్ను చార్మినార్ జోన్లో కలుపాలని పలు సార్లు సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి మూడేండ్ల పోరాటానికి ఫలితం దక్కింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు ఎంపీ అహర్నిశలు శ్రమించారు. ఈ మేరకు జోగుళాంబ జోన్ నుంచి తొలగించి చార్మినార్ జోన్లో కలుపుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంతో కాలంగా వికారాబాద్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో వికారాబాద్ ప్రజలకు మేలు జరుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఈ జోన్ మార్పు సాధ్యమైంది.
ఎట్టకేలకు మోక్షం..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని జోన్లని ప్రకటిస్తూ రాజపత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలోని (1)(2) క్లాజ్ల కింద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్-2018కి ఆమోద ముద్ర వేసినట్లు స్పష్టం చేసింది. పోలీసు శాఖ మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిస్తుందని గెజిట్ నోటిఫికేషన్లో కేంద్రం వెల్లడించింది. కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో జిల్లాలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ప్రధానంగా విద్యా, ఉద్యోగావకాశాల్లో అసమానతలు తొలిగిపోనున్నాయి. స్థానిక రిజర్వేషన్లు పక్కాగా అమలుకానున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోన్ల విధానం వల్ల రాష్ర్టానికి నష్టం జరిగిందనే భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జోనల్ విధానం రూపకల్పనపై దృష్టి సారించారు. నగరాలు, పట్టణాలు, ఇతర రకాలుగా పురోగమించిన జిల్లాలకే కాకుండా మారుమూల, ఏజెన్సీ, ఇతరత్రా వెనకబడిన జిల్లాలకు అన్ని విధాలా న్యాయం చేయాలన్న సంకల్పంతో కొత్త జోనల్ విధానాన్ని ఖరారు చేశారు. తొలుత 31 జిల్లాలకు జోనల్ విధానాన్ని రూపొందించగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేటలను సైతం కొత్తగా ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఏర్పాటు చేసిన జోనల్ విధానంలో వికారాబాద్ పరిస్థితిని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. దానిని జోగుళాంబ జోన్ నుంచి చార్మినార్లో కలుపాలని సీఎం కేసీఆర్, కేంద్ర హోంశాఖ పెద్దల దృష్టికి ఎంపీ రంజిత్రెడ్డి తీసుకెళ్లారు. మొత్తం 33 జిల్లాల పరిధిలో జోనల్ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా ఎట్టకేలకు నేటికి మోక్షం లభించింది.
ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక చర్యలు సఫలం..
ఏడోజోన్ జోగుళాంబ కింద ఉన్న వికారాబాద్ జిల్లాను ఆరవ జోన్ చార్మినార్లో చేర్చడంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి సఫలీకృతం అయ్యారు. ఈ విషయాన్ని ఎంపీ రంజిత్రెడ్డి పలుమార్లు పార్లమెంట్ వేదికగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖలోని అధికార వర్గాలకి వేర్వేరుగా ఎన్నోమార్లు వినతిపత్రాలు అందజేశారు. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రం మంచి ఉద్దేశంతో నూతన జిల్లాలను ఏర్పాటు చేసిందని, వాటికి అనుకూలంగా విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని నొక్కి చెప్పారు. దీంతో జోనల్, మల్టీ జోనల్ కారణంగా విద్యార్థులు, ఉద్యోగ అన్వేషణ అభ్యర్థులు నష్టపోరని ఎంపీ రంజిత్రెడ్డి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకుపోయారు. దీనికి తోడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల ఎంపీగా తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి, హోంశాఖకి, రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎంపీ రంజిత్రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనకు ఈ విషయంలో సహకరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజానీకానికి ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు.