కరోనా కట్టడిలో నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి
విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నందున్న జాగ్రత్తలు పాటించాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి కొనుగోలు
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
వికారాబాద్, ఏప్రిల్ 20 : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో రెండో దశ కొవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు, పౌర సరఫరా, కొవిడ్ 19 నైట్ కర్ఫ్యూ, ప్రైవేటు టీచర్లకు నగదు, బియ్యం పంపిణీపై కలెక్టర్తో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు వికారాబాద్ జిల్లాలో 191 సెంటర్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ నివారణ కోసం జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేయాలన్నారు. చెక్పోస్ట్లను పకడ్బందీగా ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి రాకుండా చూడాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వరిధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు ఏ గ్రేడ్ రకానికి రూ.1888, సాధారణ రకానికి 1868 ధర నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 191 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ ద్వారా 80, సహకార సంఘాల ద్వారా 52, డీసీఎం ఎస్ ద్వారా 54, మార్కెట్ కమిటీ ద్వారా 5 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సారి జిల్లాలో 69.667 ఎకరాల్లో వరి సాగు అయిందన్నారు. వరి ఉత్పత్తి 1.74 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశామని, ఇందుకు గాను కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అవసరమైన టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లు, వెయింగ్ మిషన్లు, ఏర్పాటు చేయాలని అధికారులకుసూచించారు. గన్నీ బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి సెంటర్ వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు ఒకేసారి రాకుండా వారికి ముందుగా టోకెన్స్ అందించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచి కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రాలు 26 నుంచి ప్రారంభం అవుతాయని, రేపటి నుంచి వికారాబాద్ జిల్లాలో 1839 ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో రూ. 36లక్షల 78వేల నగదు, 25 కిలోల బియ్యం చొప్పున 35వేల 50 కేజీలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా విద్యాధికారి రేణుకదేవి, అదనపు ఎస్పీ రషీద్, పౌర సరఫరాల, మార్కెటింగ్, వైద్య, రెవెన్యూ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి సబితారెడ్డి
ప్రజలందరి దీవెనలతో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుంటారని రాష్ట విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. స్వల్ప లక్షాణాలతో కరోనా పాజిటివ్ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజా క్షేత్రంలోకి వస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.