అధికారులు, అభ్యర్థులు, ఎజెంట్లకు ఒకే విధానం
రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలు
రిటర్నింగ్, కౌంటింగ్ అధికారులతో ఖమ్మం కలెక్టర్
ఖమ్మం, మే 1: ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జోనల్, కౌంటింగ్ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, కౌంటింగ్ నిర్వర్తించే అధికారులు సిబ్బంది, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు తప్పనిసరిగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నెగిటివ్ రిపోర్టు చూపిస్తేనే కౌంటింగ్ హాల్లోకి అనుమతించనున్నట్లు చెప్పారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలోగానీ, తమ సమీప ఆరోగ్య కేంద్రాల్లో గానీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కౌంటింగ్ హాళ్లను శానిటైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటైజర్, మాస్కులు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ మధుసూదన్రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.