సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : గతేడాదితో పోల్చితే ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం పూర్తి కావడంతో గత రెండేళ్లుగా గోదావరి జలాలు పుష్కలంగా వస్తుండడంతో ఇంచు భూమి కూడా వదలకుండా రైతులు పంటలు పండిస్తున్నారు. మరోపక్క నాగార్జునసాగర్ నీటిని ప్రణాళికాబద్ధంగా రైతులకు అవసరమయ్యే రీతిన విడుదల చేస్తుండగా మూసీ నది కింద ఆయకట్టుకు ఢోకా లేకుండా పోయింది. దీంతో ఈసారి యాసంగిలో జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 4,26,730 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా ఏప్రిల్ మొదటి వారంలో పంట చేతికి రానుంది. దీంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇటీవల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సుదీర్ఘ చర్చ చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో దాదాపు 10,58,290 మెట్రిక్ టన్నుల ధాన్యం పండనుండగా రైతులు తమ అవసరాలు, విత్తనాల కోసం ఉంచుకునే ధాన్యం పోను వారు విక్రయించేది 8,35,986 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటిలో సివిల్ సైప్లె సంస్థ కొనుగోలు చేసేది 6,26,990 మెట్రిక్ టన్నులుగా, మిల్లర్లు కొనుగోలు చేసేది 2,08,996 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని భావిస్తున్నారు. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా 316 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండగా వీటిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 188 ఉండనుండగా పీఏసీఎస్ 123 ఉన్నాయి. అలాగే జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్లలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. కొనుగోళ్ల ప్రారంభానికి ముందే 316 వెయింగ్ మిషన్లు, 12,640 టార్బాలిన్లతోపాటు 1,56,74,750 గన్నీ బ్యాగుల సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు.