కార్పొరేషన్లోనూ టీఆర్ఎస్దే గెలుపు
అందరి మద్దతుతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ
సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
మా వెంటే ప్రజలు, పట్టభద్రులు, ఉద్యోగులు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, మార్చి 21 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భూ స్థాపితం అయ్యిందని, బీజేపీ లేచే పరిస్థితుల్లో లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన సందర్భంగా ఆదివారం హన్మకొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వారి రెచ్చగొట్టే మాటల వల్లే ప్రజలు తగిన బుద్ధిచెప్పారన్నారు. ప్రజల మద్దతు టీఆర్ఎస్కు ఉంది కాబట్టే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సంపూర్ణ మెజార్టీతో గెలిచారన్నారు. ముందు ముందు కూడా ఇదే సంప్రదాయ కొనసాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎందుకు ఛీ కొడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా మీకు ఇవ్వలేదంటే ప్రజల్లో మీ స్థానం ఏమిటో ప్రశ్నించుకోవాలన్నారు. బీజేపీని ప్రజలు నమ్మలేదు కాబట్టే కౌన్సిల్లో స్థానం లేకుండా చేశారని ఎద్దేవా చేశారు.
కేంద్రం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించారన్నారు. ఇప్పటికైనా విభజన చట్టం హామీలైన కోచ్ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లోలైనా రెండు పార్టీలు చిత్తుగా ఓడడం ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నకు పరోక్షంగా సహకరించడంతోనే అన్ని ఓట్లు వచ్చాయన్నారు. దొంగ ఓట్ల ఆరోపణలు అబద్ధమని అన్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేశారని పట్టభద్రులను అవమానించొద్దని, గతంలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచారు కదా.. అప్పుడు మీరు డబ్బులు పంపిణీ చేశారా అని ప్రశ్నించారు. ప్రజల అండదండే టీఆర్ఎస్కు శ్రీరామ రక్ష అన్నారు. వరంగల్కు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వచ్చే నిధులతో పాటు ఈ సారి బడ్జెట్లో అదనంగా రూ. 250 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు రూ.300కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్కు వెన్నంటి ఉంటూ సహకరించిన ప్రజలు, పట్టభద్రులందరికీ పేరు పేరునా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జన్ను జకార్య, హరి రమాదేవి పాల్గొన్నారు.