పెరుగుతున్న మరణాల సంఖ్య
ఉమ్మడి జిల్లాలో వేగంగా వైరస్ వ్యాప్తి
ఒక్కరోజే 1134 కొవిడ్ కేసులు నమోదు
నిజామాబాద్లో 572.. కామారెడ్డిలో 562
నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 22: మద్నూర్ ఎంపీడీవో నగేశ్ కరోనాతో మృతి చెందినట్లు ఎంపీవో వెంకటనర్సయ్య తెలిపారు. ఆయన మృతికి సంతాపంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సిబ్బంది నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.
హెడ్ కానిస్టేబుల్ ..
నిజామబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్తో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చంద్రసేన్(56) కరోనాతో మృతి చెందారు. ఈ నెల20న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స నిమత్తం దవాఖానలో చేరాడు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఆయన మృతికి పోలీసు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
నవీపేటలో జీపీ కార్మికుడు..
నవీపేట, ఏప్రిల్ 22: నవీపేట మేజర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుడు గంగారాం(58) కరోనా తో గురువారం మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు. జీపీలో 30 ఏండ్లుగా పనిచేస్తున్న గంగారాం 20 రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. చికిత్స కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతికి జీపీ పాలక వర్గం సంతాపం వ్యక్తం చేసింది. అంత్యక్రియల్లో సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, జీపీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
దూపల్లిలో ఒకరు..
రెంజల్, ఏప్రిల్ 22: మండలంలోని దూపల్లి గ్రామాని కి చెందిన లక్ష్మణ్ (50) కరోనాతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్లో ఉన్నాడని, గురువారం చికిత్స కోసం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని పేర్కొన్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది కొవిడ్ నిబంధనల మేరకు పూర్తి చేశారు.
ఉప్లూర్లో ముగ్గురి మృతి
మోర్తాడ్(కమ్మర్పల్లి), ఏప్రిల్ 22: కరోనా మహమ్మారితో విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నా అన్నవాళ్లు లేకుండానే అంత్యక్రియలు జరిపే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే పరిస్థితి ఉప్లూర్లో చోటు చేసుకుంది. రాజేశ్వర్రావు(75) అతని భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. వచ్చిన తరువాత కొవిడ్ వచ్చిందని తెలిసి కరీంనగర్లో భార్యభర్తలు ఇద్దరు ప్రైవేటు దవాఖానలో చికిత్స నిమిత్తం చేరారు. రాజేశ్వర్రావు బుధవారం రాత్రి మృతి చెందడంతో ఆయన కుటుంబీకులు గురువారం మృతదేహానికి సొంత గ్రామం సోన్లో అంత్యక్రియలు జరిపించారు. వీరి కుటుంబం 30ఏండ్లుగా ఉప్లూర్లో స్థిరపడ్డారు. భార్య దవాఖానలో చికిత్స పొందుతుండగా భర్త మృతి చెందిన సంఘటన గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. ఇదే గ్రామానికి చెందిన వేంపేట రాజు(52), గందంఎల్లవ్వ(75) కూడా కరోనా బారిన పడి గురువారం మృతి చెందారు.
రాజంపేట్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు..
రాజంపేట, ఏప్రిల్ 22: మండల కేంద్రానికి చెందిన ఇంతియాజ్ ఆలీ(53) కరోనా బారిన పడగా, హైదారబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.