అదనపు కలెక్టర్ రఘురామ్శర్మ
ఆక్సిజన్ బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల,మే18: కరోనా రోగుల పట్ల వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ రఘురామ్శర్మ జిల్లా వైద్యాధికారి, వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో దవాఖాన అభివృద్ధి సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జెడ్పీచైర్పర్సన్ సరిత, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా దవాఖానలో కొవిడ్ రోగులకు అందుతున్న సేవలు, వారికి ఇస్తున్న పౌష్టికాహారం, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర వాటిపై జేసీ జిల్లా వైద్యాధికారి చందూనాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దవాఖానలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కరోనా రోజు రోజుకూ ఉధృతమవుతుందని దీనిని అరికట్టడానికి అందరి సహకారం అవసరమన్నారు.
ఎవరి స్థాయిలో వారు అవగాహన కల్పించి కరోనా కట్టడికి కృషి చేయాలని సూచించారు. దవాఖానలో రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ తదితరవి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి కరోనా వార్డుకు ఒక వైద్యున్ని నియమించి వారి పర్యవేక్షణలో రోగులకు సేవలు అందించాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్వో చందూనాయక్ మాట్లాడుతూ కరోనా రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుం డా వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ కొరత సమయంలో గద్వాల ఎమ్మెల్యే చేయూత నిచ్చి దవాఖానలో ఆక్సిజన్, మందుల కొరత లేకుండా తన వంతు చేయూత నిస్తున్నారని తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. దవాఖానలో ఏవైనా సమస్యలు ఉంటే చెబితే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దవాఖానలో ఆక్సిజన్ బెడ్లు 60 ఉన్నాయని వాటిని ఇంకా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందే పరిస్థితులు లేనందున మన దవాఖానలోనే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తూ వారిని కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నందున దవాఖానలో బెడ్లు పెంచాలని కోరారు. దవాఖానలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తే మరింత మంది వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దవాఖానకు దాతలు ఇచ్చిన వస్తువులు ఒక రికార్డులో రాసి ఉంచితే ఇది ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. దవాఖాన అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ దవాఖానల్లో మరిన్ని వసతులు కల్పించాలని సూచించారు. పరీక్షల కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెస్ట్లు చేయాలన్నారు. సీఎం ఇంటింటి సర్వే మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో రాములు, ఆర్ఎం వృశాలి, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైద్యులు ఇర్షాద్,సౌజన్య పాల్గొన్నారు.