పంచనారసింహుడు స్వయంగా వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రం యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ప్రభాత వేళ నిత్యపూజలు చేసి కైంకర్యాలు సమర్పించిన అనంతరం వైశేక హోమాలు, ప్రత్యేక తిరుమంజనం నిర్వహించారు.ఆ తర్వాత స్వామివారిని సుందరంగా అలంకరించారు. స్వామివారి ఆస్థానంలో విశ్వక్సేన పూజ, స్వస్తివాచనం, రక్షా బంధనం, మంత్రపుష్ప నీరాజనాలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం మృత్సంగ్రహణం నిర్వహించి అంకురార్పణ చేశారు. అంతకుముందు గర్భాలయంలో స్వయంభువుడైన శ్రీ లక్ష్మీ నరసింహునికి పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు స్వామివారి అనుమతిని స్వీకరించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, కార్యనిర్వహణాధికారి ఎన్. గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగళ్ లక్ష్మీనారసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీమాన్ ఉభయ వేదాంతం శేషం ప్రణీత్ కుమారాచార్యులు, యాజ్ఞీక సిబ్బంది,ఉప ప్రధానార్చకులు వెంకటాచార్యులు, రంగాచార్యులు, సురేంద్రచార్యులు, శ్రీధరాచార్యులు, సహాయ కార్యనిర్వహ ణాధికారులు శ్రవణ్కుమార్, రమేశ్బాబు, ఆలయ పేష్కార్, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పదకొండు రోజుల పాటు అత్యంత పవిత్రంగా జరిగే ఈ ఉత్సవాలను నిర్వహించేవారు నియమ నిష్టలతో, దైవీ భావనతో మెలగాల్సి ఉంటుంది. శుచి, శుద్ధితో నడుచుకోవాల్సి ఉంటుంది. ఒక దీక్షలా కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం ఉత్సవాలను నిర్వహించే వారిని అవి ముగిసే వరకు కంకణ బద్ధులుగా ఉంచేందుకు పవిత్ర కంకణాలకు మంత్రములతో ఆరాధన చేస్తారు. స్వామి వారికి, అమ్మవారికి సమర్పించిన అనంతరం ఆలయ అనువంశికకర్త, ప్రధానాచార్యులు, ఇతర యాజ్ఞీకులు, ఈవో తదితరులు రక్షాబంధనం స్వీకరించారు.
శ్రీ లక్ష్మీ నరసింహుడికి ప్రతి ఏటా ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుండి శుద్ధ ద్వాదశి వరకు అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సారి సోమవారం (మార్చి 15) నుంచి 25 వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా బాలాలయంలో కొనసాగుతున్నాయి. స్వామివారి రక్షాబంధనాలు తోడుగా వేద పండితులు మంత్రోచ్ఛారణ చేస్తుండగా మంగళకర వాయిద్యాల నడుమ ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో ఎన్.గీత, ప్రధానార్చకులు నల్లంధీగళ్ లక్ష్మీనారసింహచార్యులు, మోహనాచార్యులు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు స్వామివారి గర్భాలయానికి చేర్చారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహుడికి పూజలు నిర్వహించి ఉత్సవ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతీ ఏటా పోచంపల్లికి చెందిన చేనేత మహాజన సంఘం వారు నియమ నిష్టలతో స్వామి, అమ్మవార్లకు మగ్గంపై పట్టుతో వస్ర్తాలు తయారుచేసి అందిస్తారు. ఈసారి గతంలోకన్నా అద్భుతంగా 8 రోజుల పాటు శ్రమించి మగ్గంపై అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. స్వామివారికి గోధుమ వర్ణంలో పచ్చని అంచుతో కూడిన పట్టు పంచె, అమ్మవారికి నీలిరంగు, ఆకుపచ్చ వర్ణాల్లో రెండు పట్టు చీరెలు తయారు చేశారు. ఇందులో ఆకుపచ్చని చీరె పోచంపల్లి పాన్పటోల డిజైన్తో తయారు చేయగా, నీలిరంగుతో కూడిన మరో చీరె అంచుపై శంకుచక్రాలను తీర్చిదిద్దారు.సోమవారం వాటిని ఆలయ ఈవో గీత, అనువంశికధర్మకర్త బి. నర్సింహమూర్తిలకు అందజేశారు. కాగా, బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో ఎన్. గీత దేవాలయ యూనిఫాం వస్ర్తాలను అందజేశారు. వేడుకల్లో భాగంగా ప్రతీ రెండేళ్లకోసారి సిబ్బందికి వస్ర్తాలను అందజేయడం ఆలయ సంప్రదాయంగా వస్తుంది. సుమారు 240 సిబ్బందికి సోమవారం వస్ర్తాలను అందజేశారు.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనది మృత్సంగ్రహణం. మృత్సంగ్రహణమంటే మృత్తికను తీసుకురావడం. సోమవారం సాయంత్రం ఆరున్నరకు అర్చక బృందం మేళతాళాలతో పుట్ట వద్దకు వెళ్లి పూజ చేసి, భూసూక్తాన్ని పఠించి పుట్టమన్నును స్వీకరించారు. మట్టిని తొమ్మిది నవ పాలికల్లో వేసి నవధాన్యాలు ఉంచి మంత్ర జపాలతో ప్రోక్షణ చేసి అంకురార్పణ చేశారు. ఉత్సవాలు ముగిసే వరకు వీటిని కదిలించరు.