సారంగాపూర్, మార్చి 15: ఆయనో ప్రధానోపాధ్యాయుడు.. ఓ వైపు విద్యారంగానికి ఎనలేని సేవలందిస్తూ మరోవైపు సామాజిక సేవలో తరిస్తున్నాడు. తాను ఏ పాఠశాలకు వెళ్లినా అక్కడ గుణాత్మక మార్పులు తెస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. కళామతల్లిని ఆరాధిస్తూ మిమిక్రీ చేస్తాడు. మరోవైపు పాటలు రాస్తూనే.. తన మధురమైన గొంతుతో పాడి ఆహూతులను అలరిస్తాడు. తన విధులు నిర్వర్తించిన ఆయా పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడం, బడిబయట పిల్లలను బడిలో చేర్చడం, వినూత్న బోధనాపద్ధతులు అనుసరించి ఆకట్టుకొనేలా విద్యాబోధన చేయడం ఆయన ప్రత్యేకత. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటాడు. ముఖ్యంగా రక్తదానం చేస్తూ ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న గోనే మాణిక్యం వివిధ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా(కె) గ్రామానికి చెందిన మాణిక్యం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పాఠశాలల్లో పని చేశాడు. ప్రస్తుతం సారంగాపూర్ మండలం కంకెట ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. 2002 డీఎస్సీలో ఎంపికై తొలుత తన స్వగ్రామం లింబా(కె)లో ఉపాధ్యాయవృత్తిని ప్రారంభించాడు. అనంతరం వాంకిడి మండలంలోని దొడ్డిగూడ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వెళ్లాడు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితి ఉండగా.. ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అలాంటిది గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కొలాం భాషను నేర్చుకొని తల్లిదండ్రులకు చదువు విలువ తెలియజేస్తూ 62 మంది విద్యార్థులు బడికి వచ్చేలా చేశారు. అక్కడి నుంచి కడెం మండలం బుట్టాపూర్ పాఠశాలకు బదిలీ అయ్యారు. 65 మంది ఉన్న విద్యార్థులతో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేసి, ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యావలంటీర్లతో విద్యను బోధించి ఆ సంఖ్యను 225కు పెంచారు. ప్రాథమిక పాఠశాలగా అప్గ్రేడ్ చేసి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడంలో ఎంతో కృషి చేశారు. కంకెట పాఠశాలకు 2018లో బదిలీ వచ్చారు. పాఠశాల ముందున్న స్థలంలోంచి ఆవులు, బర్రెలు, గొర్రెలు వెళ్తుండడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి, సిమెంట్ పోల్స్ తెప్పించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. గ్రామస్తులు, యూత్ సభ్యుల సహకారంతో హరితహారంలో భాగంగా 210 మొక్కలు, రూ.30 వేలతో పిల్లలు ఆడుకోవడానికి ఇనుప జారుడు బల్లలు, ఉయ్యాల, మరికొన్ని ఆటవస్తులను ఏర్పాటు చేయించారు. మధ్యాహ్న భోజనం ప్లేట్స్, గదుల్లో ఫ్యాన్స్, కూర్చోవడానికి బెడ్షీట్స్, పాఠశాలకు ప్రధాన గేట్ చేయించారు. మాణిక్యం బాధ్యత తీసుకున్నప్పుడు పాఠశాలలో 33 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 55 మంది ఉన్నారు. రూ.5వేలు ఖర్చు చేసి విద్యార్థులకు వర్క్షీట్లు జిరాక్స్, దాతల సహకారంతో రూ.25 వేల విలువైన టీవీ ఏర్పాటు చేయించారు. రెండేండ్లుగా గురుకుల పాఠశాలలకు విద్యార్థులు ఎంపికవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మాణిక్యం ఉపాధ్యాయుడిగానే కాకుండా వివిధ కళల్లో రాణిస్తున్నాడు. పాటలు పాడటం, రాయడం, టీవీ, రేడియోల్లో అచ్చం క్రికెట్ చూస్తున్నట్లు, వింటున్నట్లు కామెంటరీ చేయడం వంటివి చేస్తారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రెండుసార్లు ప్రోగ్రామ్లు కూడా చేశాడు. ఇదే కాకుండా మాణిక్యం హైదరాబాద్లో ఫార్మసీ విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఒక వృద్ధుడికి రక్తం అవసరం కాగా.. ఇచ్చాడు. అయినా చనిపోయాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన రక్తదానం ఎంత గొప్పదో తెలుసుకుని ప్రతి ఏడాది 3, 4 సార్లు రక్తదానం చేస్తున్నాడు ఇప్పటి వరకు 50 సార్లకు పైగా రక్తదానం చేయడమే కాకుండా ఆరుసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించాడు.