ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆత్మకూరు, ఏప్రిల్ 22 : కరోనా మహమ్మారికి ప్రపంచమే వణికిపోతున్న పరిస్థితుల్లో ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి సన్నబియ్యాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపత్కాలంలో అందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మూతబడిన ప్రైవే టు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకునేందుకు సన్నబియ్యంతోపాటు రూ.2వేల నగదు అందిస్తున్నట్లు తెలిపారు. యూడైస్ ఆధారంగా విద్యాశాఖ గుర్తించిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పొందాలన్నారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలల సమీపంలో, నివాసముండే పరిసరాల్లోని రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మండలంలో 123 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తిప్డంపల్లి, ఆరెపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మట్టి పేడలు, తాళు లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ఇబ్బందులు పడొద్దనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి రకానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,688 ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రీయాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఎంఈవో భాస్కర్సింగ్, రైతుబంధు సమితి నాయకుడు వీరేశలింగం, మాజీ ఎంపీపీ మొగిళి శ్రీధర్గౌడ్, డీసీవో కోదండరాం, సర్పంచ్ అనసూయమ్మ, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.