పల్లె ప్రకృతివనంలో తీరొక్క మొక్కల పెంపకం..
రూపుదిద్దుకుంటున్న మంకీ ఫుడ్కోర్టు
హరితహారంతో ఊరంతా పచ్చదనం
పెద్దవంగర, మార్చి 15 :రాష్ట్ర ప్రభుత్వ సహకారం.. గ్రామ పాలకవర్గం, అధికారయంత్రాంగం సమన్వ యం, సమృషి కృషితో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అవుతాపురం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పల్లెల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇస్తుండడంతో గ్రామం సరికొత్త రూపు సంతరించుకుంది. ముఖ్యంగా పల్లె ప్రగతిలో రూ.1.42కోట్లతో చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సీసీరోడ్లు, అంతర్గత మట్టిరోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు, పాత బావులు, శిథిలమైన ఇండ్ల కూల్చివేతతో పాటు తీరొక్క మొక్కలతో ప్రకృతి వనం, కోతుల ఆహారం కోసం మంకీఫుడ్ కోర్టు, నర్సరీ, చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు, ఎరువు కోసం కంపోస్ట్ షెడ్, చెత్త సేకరణ కోసం కొత్తగా ట్రాక్టర్, ట్రాలీ, నీళ్లు పట్టేందుకు ట్యాంకర్, చివరి మజిలీ చింత తీర్చే వైకుంఠధామం ఇలా సకల సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
మార్పు తెచ్చిన పల్లె ప్రగతి
గ్రామంలో పల్లె ప్రగతి పక్కాగా అమలుకావడంతో అనేక మార్పులు వచ్చాయి. పాలనలో చిత్తశుద్ధి, ఓర్పు, సక్రమంగా నిధులను వినియోగించడంతో ప్రజల అవసరాలు తీరేలా సదుపాయాలు సమకూరాయి. ఊరిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.55లక్షలు, అంతర్గత మట్టి రోడ్ల కోసం రూ.5లక్షలు, పారిశుధ్యం పైపులైన్లకు రూ.5లక్షలు, శ్మశానవాటికకు రూ.9.60లక్షలు, నర్సరీకి రూ.3లక్షలు, కంపోస్ట్ట్ షెడ్ కోసం రూ.2.55లక్షలు, డంపింగ్యార్డుకు రూ.60వేలు, రూ.6.50లక్షలతో పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహారశాల నిర్మాణానికి రూ.2 లక్షలు, గ్రామ పంచాయతీ కొత్త భవన నిర్మాణానికి రూ.20లక్షలు, రైతు వేదికకు రూ.22 లక్షలు, 17బావుల పూడ్చివేతకు రూ.2లక్షలు పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్కు రూ.9.20లక్షలు వెచ్చించారు. గ్రామ సమీపంలో ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్ది వాకింగ్ ట్రాక్ నిర్మించారు. మంకీ ఫుడ్ కోర్టు కోసం ఎకరం పది గుంటల స్థలంలో పండ్ల మొక్కలు పెంచుతున్నారు.
అన్నివిధాలా
బాగు చేసుకుంటున్నాం
గ్రామం స్వచ్ఛత దిశగా పరుగులు తీస్తున్నది. పల్లె ప్రగతితో అవుతాపురం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ నిధులతో సీసీరోడ్లు, మురుగు కాల్వల పైపులైన్లు వేయించాం. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం, నర్సరీ ఏర్పాటు చేసుకున్నాం. ట్రాక్టర్తో ఎన్నో సమస్యలు తీరాయి. ఇలా ఊరిని అన్ని విధాలా బాగుచేసుకుంటున్నాం.
నర్సరీలో 33వేల మొక్కల పెంపకం..
ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసేందుకు నర్సరీలో వివిధ రకాల పండ్లు, పూలు, నీడనిచ్చే 33వేల మొక్కలు పెంచుతున్నారు. వచ్చే వానకాలం నాటికి నర్సరీలో ఉన్న మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.
పాత బావులు, ఇండ్లు పూడ్చివేత..
గ్రామంలో ఉన్న 14 పాత చేదబావులు, మూడు పాడుబడ్డ వ్యవసాయ బావులను పల్లె ప్రగతిలో పూడ్చివేశారు. 9వ వార్డులో ఓ బావిని పూడ్చి అంతర్గత సీసీ రోడ్డు వేయడంతో పాటు 3వ వార్డులో బావిని పూడ్చి ఆ స్థలంలో ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ భవనం నిర్మిస్తున్నారు. గ్రామంలో విద్యుత్ సమస్య ఉన్న తీగలను తొలగించి, అవసరం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 30 విద్యుత్ స్తంభాలు వేశారు.