నేలరాలిన వరి, మామిడి, నిమ్మ, బొప్పాయి
నల్లగొండ జిల్లాలో 4,900 ఎకరాలు,
సూర్యాపేటలో 2,048 ఎకరాల్లో పంట నష్టం
కూలిన చెట్లు.. పిడుగుపాటుకు పశువుల మృతి
నల్లగొండ/సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 23:ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా గాలి దుమారంతో మొదలై గంటకుపైగా విరుచుకుపడడంతో వరితోపాటు మామిడి, నిమ్మ, బొప్పాయి పంటలు నేల పాలయ్యాయి. కూరగాయల తోటలూ దెబ్బతిన్నాయి. అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో గురువారం రాత్రి కురిసిన ఈదురుగాలుల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. కోత దశలో వరి నేలవాలి ధాన్యం రాలిపోగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. రెండు జిల్లాల్లో 3,654ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా 3,310ఎకరాల్లో ఉద్యాన, కూరగాయలకు నష్టం జరిగింది. మామిడి, నిమ్మ, బొప్పాయి రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు రోడ్ల వెంట చెట్లు కూలిపోగా పిడుగుపాటుకు నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో రెండు ఎద్దులు, మునుగోడు మండలం జక్కలివారిగూడెంలో మరో ఎద్దు, నార్కట్పల్లిలో బర్రె మృతిచెందింది. నల్లగొండ మండలం ఆర్జాలబావిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మిర్యాలగూడ డివిజన్లో కల్లాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. నల్లగొండ జిల్లాలో డిండి, మిర్యాలగూడ, చిట్యాల, నార్కట్పల్లి, మునుగోడు, నాంపల్లి, మాడ్గులపల్లి, నిడమనూరు, చింతపల్లి, చందంపేట, దేవరకొండ, మర్రిగూడ మండలాల్లో నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లాలో 413మంది రైతులు పంట నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. నడిగూడెం మండలంలో రూ.4కోట్లు, మోతెలో రూ.1.5కోట్లు, మునగాలలో రూ.30లక్షలు, పెన్పహాడ్లో రూ.20లక్షలు, చివ్వెంల మండలంలో రూ.50వేల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనావేశారు. 155మంది రైతులకు చెందిన 1,140ఎకరాల్లో మామిడి, నిమ్మ, బొప్పాయి పంటలకు నష్టం జరిగింది. వ్యవసాయాధికాలు పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ.. వ్యాక్సిన్ ఫ్రీ
ఒక్కో నిమిషం కొన్ని ప్రాణాల ఖరీదు