గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
సీఎం కేసీఆర్కు ప్రజల కృతజ్ఞతలు
త్రిపురారం: మండలంలోని లోక్యాతండా, మంగల్తండా, రాజేంద్రనగర్, పలుగుతండా ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోకుండా ఉండేవి. మండల కేంద్రానికి 20కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తండాల నుంచి మండల కేంద్రానికొచ్చే వారు తక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామానికి వెళ్లేందుకు బీటీ రోడ్లు, గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచే నర్సరీలు, నిరంతరం ప్రతి ఇంట్లో ఉచిత విద్యుత్.. అన్నీ అందుబాటులోకొచ్చాయి. తమ పిల్లలను ఉన్నతస్థాయిలో చదివించడానికి గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిన ప్రభుత్వం వ్యవసాయ కుటుంబాలకు రైతుబీమా, రైతుబంధు ద్వారా దగ్గరయ్యింది. అంతేకాకుండా నూటికో.. కోటికో అన్నట్టు వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఉండేవి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులందరికీ పింఛన్లు ఇస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నారు.
పుష్కలంగా తాగు, సాగునీరు
తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లిన తండాల్లో ఇప్పుడు ప్రతి ఇంట్లో నల్లా తిప్పగానే మిషన్ భగీరథ నీరు పుష్కలంగా వస్తోంది. చివరి భూములకూ లిఫ్టుల ద్వారా నీరందుతుండడంతో గిరిజనులు సజ్జ, జొన్న, పత్తి పంటలు సస్యశ్యామలంగా సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.10 వేలు ఇవ్వడం పట్ల ముఖ్యంగా గిరిజనుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
పంచాయతీలు.. అభివృద్ధికి సోపానాలు
గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారడంతో సీసీ రోడ్లు, తాగునీరు, కరెంటు సౌకర్యం, నిధులు కూడా సక్రమంగా వస్తున్నాయి. తమ ఊరికే పంచాయతీ కార్యదర్శులు, మండలాధికారులు విచ్చేస్తుండటం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కాగా అందుతున్నాయి. దీంతో తండావాసుల ఇబ్బందులు తొలగిపోయాయి.
అభివృద్ధికి బాటలు వేశారు..
మండల కేంద్రానికి 30కిలోమీటర్ల దూరంలో మా తండా ఉంది. మా తండా ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. కానీ పంచాయతీగా ఏర్పడిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు మా ముంగిట్లోకి వస్తున్నాయి. అభివృద్ధికి బాటలు వేసిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.