పచ్చదనంతో కొత్త రూపు
అందమైన బొమ్మలతో పల్లె ప్రకృతి వనం
గ్రామంలో రైతువేదిక.. వైకుంఠధామం నిర్మాణం
డంపింగ్ యార్డుతో చెత్తపై సమరం
హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం
జగదేవ్పూర్ మార్చి 15:ఒకప్పుడు ఆ గ్రామ రోడ్లు అధ్వానంగా ఉండేవి.. ఇప్పుడు గల్లీగల్లీలో సీసీతో అందంగా కనిపిస్తున్నవి.. పల్లె ప్రకృతిలో భాగంగా ఔరా! అనిపించేలా ఇటిక్యాల గ్రామం మారింది. ఒకప్పటి మారుమూల గ్రామం నేడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గతంలోనే ఉన్న ఊడల మర్రి చెట్లకు రంగులు అద్దడంతో ప్రకృతి వనంలో ఉన్న దేవాలయాలకు కొత్త సొబగులు సంతరించుకున్నాయి.
అభివృద్ధికి ఆమడదూరంలో కొట్టుమిట్టాడిన మారుమూల గ్రామం. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో నేడు మండలానికే ఆదర్శంగా నిలుస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో పల్లెప్రగతి కార్యాచరణ అమలుతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గతంలో గతుకుల రోడ్లతో అధ్వానంగా కనిపించేది. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదారేండ్లలో కోట్లాదిరూపాయలను వెచ్చించి గ్రామంలో ప్రతి వీధికి సీసీరోడ్లు, పల్లెప్రగతి కార్యక్రమంలో పాత ఇండ్లు, ప్రమాదకర పాత బావులను పూడ్చి వేయడంతో పాటు మొక్కలను నాటడంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పార్కులో నాటిన పండ్ల, పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రైతువేదికతో పాటు నర్సరీ, గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు నిర్మించిన డంపింగ్యార్డు ఇలా.. గ్రామంలో అన్ని ఏర్పాటు కావడంతో గ్రామం అభివృద్ధి అదిరేలా ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో 2173 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1179 మంది పురుషులు, 994 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 1481 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం గ్రామంలో 669 రేషన్ కార్డులతో పాటు 296 మంది ప్రభుత్వ పింఛన్లు పొందుతున్నారు.
ఆకర్శనీయంగా పల్లెప్రకృతి వనం..
పల్లెప్రగతి కార్యాచరణలో భాగంగా గ్రామంలో 2ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఆకర్షనీయంగా కనిపిస్తోంది. సహజ సిద్ధంగా ఉన్న రాతి బండలపై గీసిన పులి, ఏనుగు, నెమలి, నక్క బొమ్మ చిత్రా లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన పూలు, షోకేజీ, ఔషధ మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పార్కుకు చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి.
స్వచ్ఛత.. శుభ్రత…
గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేశారు. పాత ఇండ్లను కూల్చడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ముందుగా గ్రామస్తులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలు అందించి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా పారిశుధ్య సిబ్బంది డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తతో అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. గ్రామంలో 27 ఇంకుడు గుంతలను నిర్మించి జలసంరక్షణపై అవగాహన కల్పించారు.
గ్రామంలో నర్సరీ ఏర్పాటు..
గ్రామాన్ని హరితవనంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా శాశ్వత ప్రాతిపదికన నర్సరీ ఏర్పాటు చేశారు. గ్రామంలో నాటడానికి కావాల్సిన మొక్కలకు అందులో పెంచుతున్నారు. గ్రామంలోని సీసీరోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
సంఘటితానికి రైతువేదిక ..
రైతు సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు వినూత్న వ్యవసాయ ఆలోచనలు సాంకేతికతను పంచుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన రైతువేదిక నిర్మాణం అన్ని హంగులతో పూర్తి చే సుకొని ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
గ్రామాభివృద్ధి ఇలా..
గ్రామంలో పలు కాలనీలలో లక్షలాది రూపాయలతో సీసీరోడ్డు, అండర్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. ఉన్నత పాఠశాలలో కొత్త భవన నిర్మాణంతో పాటు మహిళా సమైక్య భవనం, మహిళలు బతుకమ్మలు ఆడేందుకు బతుకమ్మ బండ నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీరందించేందుకు ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. గ్రామస్తులు పటిష్ట భద్రతకు 10 సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సీ ద్వారా అందిస్తున్న రూ.2లక్షల నిధులతో సిబ్బంది జీతాలతో పాటు పల్లెప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు, హరితహారం, డంపింగ్ యార్డు నిర్వహణ, ట్రాక్టర్ కొనుగోలు, పారిశుధ్య నిర్వహణకు వెచ్చిస్తున్నారు.