కెరమెరి, మార్చి 15: ప్రస్తుతం పట్టణాల్లో లభించే పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం కల్తీ జరుగుతున్నాయని మనం వింటూనే ఉన్నాం. ఇటు పట్టణాలకే కాదు.. ప్రస్తుతం పల్లెలకు కూడా ఈ కల్తీ వస్తువులు వచ్చి చేరుతున్నాయి. కాని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో లభించే స్వచ్ఛమైన పండ్లు, ఫలాలు కల్తీలేని స్వచ్ఛమైన అత్యంత పోషకాలు కలిగినవి. మార్కెట్లో కనిపించే పండ్లు నిగనిగలాడుతూ కనిపిస్తున్నా, వాటిని మగ్గబెట్టేందుకు వాడే అత్యంత ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఇక్కడ లభించే ఫలాలు ఆరోగ్యాన్నే కాకుండా ఉపాధి పొందేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి.
ఏ కాలంలో దొరకనిన్ని ఫలాలు వేసవికాలంలో లభిస్తాయి. ఎండాకాలం వచ్చిందంటే.. వనరుల కాలం వచ్చినట్లే. తరతరాల నుంచి అటవీ ఫలాలను నమ్ముకొని జీవిస్తున్న అడవి బిడ్డలకు ఈ కాలం ఓ వరం. ఇప్పపూలు మొదలుకొని మొర్రి పండ్లు, తునికాకు సేకరణతో పాటు ఎన్నో అటవీ ఉత్పత్తులు వారిని ఆదుకుంటున్నాయి. ఇప్పపూలు, మొర్రిపండ్లు, ఇప్పపరక, సారపలుకులు, ఉసిరి, జీడీ, నేరేడు పండ్లు వంటి ఫలాలతో పాటు తేనె అడవుల్లో లభిస్తాయి. ఈ పండ్ల సీజన్ కాగానే తునికాకు సేకరణ వచ్చేస్తుంది. యేటా ఆదివాసులు ఇప్పపూలు, మొర్రిపండ్లను సేకరించి నిల్వ ఉంచుతారు. పాట్నాపూర్, శివగూడ, జోడెఘాట్, బాబేఝరి, అగర్వాడ, అంతపూర్, లెండిగూడ, ఝరితో పాటు అనేక గ్రామా లో ఈ చెట్లు కనిపిస్తాయి. గతంలో అనేక ప్రాంతాల్లో పండ్లచెట్లతో అడవులు కళకళ లాడేవి. సంపూర్ణ వనరులతో నిండి ఉండే అడవులు, సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెట్లు నరికివేతకు గురయ్యాయి. తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంతో మరోసారి అడవుల పునరుద్ధరణకు అవకా శం దక్కింది. గిరిజనులు అటవీ ప్రాంతంలో లభించే పండ్ల మొక్కలను తమ చేలల్లో కూడా పెంచుతున్నారు. ఇదే వారి ఆదాయ వనరుగా మారింది. సేకరించిన పండ్లను ఇంటి అవసరాలకు వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తుంటారు. వాటి గింజలను కొన్ని రోజుల పాటు ఎండబెట్టిన అనంతరం పగులగొట్టి పలుకులు తీస్తారు. ఇప్పపూలు, మొర్రిపండ్లే కాదు పలుకులు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు అధికం. సారా పలుకులను చాలా మంది తీపి వంటల్లో వాడుతారు.