సత్తుపల్లి/ వేంసూరు, ఏప్రిల్ 28: సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి, గంగారం, రుద్రాక్షపల్లి, సదాశివునిపాలెం, కాకర్లపల్లి, సిద్ధారం గ్రామాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిచింది. బేతుపల్లిలో బలుసు రంగారావు అనే రైతుకు చెందిన సొరతోట ఈదురుగాలులకు నేలమట్టమైంది. తోటలో సొరకాయలు నేలపాలు కావడంతో రూ.50 వేల నష్టం వాటిల్లింది. గౌరిగూడెంలో ఇంటిపై కప్పు ఎగిరిపోవడంతో నిరాశ్రయులైన బాధితులకు సర్పంచ్ మందపాటి ముత్తారెడ్డి తక్షణ సాయంగా రూ.3 వేలు అందజేశారు. సదాశివునిపాలెంలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. తుంబూరులో కూలిన ఇంటిని తహసీల్దార్ మీనన్, సొసైటీ అధ్యక్షుడు చిలుకుర్తి కృష్ణమూర్తి, వైస్ సర్పంచ్ మోరంపూడి శ్రీనివాసరావు, ఆర్ఐ విజయ్భాస్కర్ పరిశీలించారు. సుమారు ఆరు కరెంటు స్తంభాలు విరిగిపోవడంతో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని ఏడీఈ కిరణ్కుమార్ తెలిపారు. సత్తుపల్లి కేపీఆర్ స్కూల్ అపార్ట్మెంట్లో పెట్టిన వేముల మల్లికార్జునరావుకు చెందిన కారు ఈదురుగాలులకు కొట్టుకుపోయి సమీపంలోని గోతిలో పడింది. వేంసూరు మండలంలో మామిడి తోటల్లో సైతం కాయలు రాలిపోయాయి. చేతికొచ్చిన మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొంత ధాన్యం తడిచింది. డిప్యూటీ తహసీల్దార్ ఎర్రయ్య ఈ పంటలను పరిశీలించారు.