ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేలతోపాటు బియ్యం అందజేత
ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
రామగిరి, ఏప్రిల్ 22 : కరోనా వేళ పాఠశాలలు మూతపడి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయగా గురువారం 25 కిలోల సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. నగదుతోపాటు బియ్యం తీసుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆపత్కాలంలో అండగా నిలిచిన సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడడంతో జీతాలు లేక కుటుంబ పోషణభారంగా మారి ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడింది. వారి పరిస్థితిని చూసి చలించిన సీఎం కేసీఆర్ వారికి భరోసా కల్పించారు. ఒక్కొక్కరికి రూ.2 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమచేశారు. అదేవిధంగా 25కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల్లో ఉచితంగా పంపిణీ చేశారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిపొందిన 8,900మంది ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
యూడైస్లో నమోదైన అందరికీ సాయం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూ డైస్లో నమోదైన ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధననేతర సిబ్బందికి రూ. 2 వేలు అందాయి. అదేవిధంగా ప్రతిఒక్కరికీ 25కిలోల సన్నబియ్యం అందించే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.
అడుగకుండానే అన్నంపెట్టిన దేవుడు కేసీఆర్..
ప్రైవేట్ ఉపాధ్యాయుల, సిబ్బంది కష్టాలు గుర్తించి అడుగకుండానే అన్నంపెట్టిన దేవుడు సీఎం కేసీఆర్ అని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్రెడ్డి అన్నారు. 25 కిలోల సన్నబియ్యం పంపిణీని గురువారం నల్లగొండలో ఆయన ప్రారంభించారు. నల్లగొండలోని శివాజీనగర్లోని రేషన్ దుకాణంలో డీలర్ దాడి అశోక్రెడ్డితో కలిసి ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి బియ్యం అందించారు. కష్టాలు గుర్తించి పిల్లలకు అన్నం పెట్టేందుకు సాయం చేసిన గొప్ప మనుస్సున మారాజు సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా నాయకులు అల్గుబెల్లి తిరుమల్రెడ్డి, సాదూ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
-ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు..
సీఎం కేసీఆర్ సార్ అందిస్తామన్న ఆర్థికసాయం డబ్బులు నా బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు మంగళవారం రాత్రే సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. కరోనా కష్టకాలంలో ఆసరాగా నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సన్నబియ్యం కూడా చాలా నాణ్యమైనవి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.
చాలా సంతోషంగా ఉంది
ఎనిమిది సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. కరోనా సమయంలో మా కష్టాలు గుర్తించిన రాష్ర్ట ప్రభుత్వం రూ.2 వేలు, 25కిలోల సన్న బియ్యం ఇచ్చి ఆదుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.