ఐదేండ్లలో గణనీయంగా పెరిగిన భూముల ధరలు
గతంలో కొనేవారు కరువు.. ప్రస్తుతం అమ్మకానికి లేని స్థలాలు
వ్యవసాయం వైపు రైతుల మొగ్గు.. ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
ఆదిలాబాద్, మార్చి 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా సాగు దండుగలా మారింది. అప్పులు చేసి పంటలు సాగు చేసినా, కనీసం పెట్టుబడులు రాక, బాకీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. పిల్లల పెండ్లిళ్లు, ఇతర అవసరాలకు భూములు అమ్ముకుందామంటే కొనేవారు లేక ఆందోళన పడాల్సి వచ్చేది. స్వరాష్ట్రంలో సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలతో వ్యవసాయం పండుగలా మారిపోయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలతో ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రైతుబంధు, రైతుబీమా, సాగునీటి సౌకర్యం, 24 గంటల ఉచిత విద్యుత్, రహదారుల నిర్మాణంతో వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కొందామంటే స్థలాలు లేవు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. యేటా సీజన్ వచ్చిందంటే చాలు రైతుల్లో ఆందోళన ప్రారంభమయ్యేది. విత్తనాలు మొదలుకొని పంటల అమ్మకాల వరకు అన్నదాతల కష్టాలు పడేవారు. అప్పులు చేసి పంటలు సాగుచేసినా పెట్టుబడులు వెళ్లక చేసిన బాకీలు కట్టలేని పరిస్థితి ఉండేది. పిల్లల పెండ్లిళ్లు, ఇతర అవసరాలకు భూములు అమ్ముకుందామంటే కొనేవారు దొరకకపోయేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో జిల్లాలో వ్యవసాయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. సబ్సిడీ విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతుబంధు, రైతుబీమా, వ్యసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల మరమ్మతులు, రాయితీపై వ్యవసాయ పనిముట్లు లాంటివి రైతుల పాలిట వరంగా మారాయి.
మూడింతలు పెరిగిన భూముల ధరలు
ఆదిలాబాద్ జిల్లాలో 6.30 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూ ములు ఉండగా, రైతులు వివిధ పంటలు సాగు చేస్తారు. పంట పెట్టుబడిలో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 1.34 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్లో రూ.270 కోట్ల అందిస్తున్నది. రైతుబీమా పథకంలో 80 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 213 చెరువులకు మరమ్మతులు చేపట్టగా, 22 కొత్త చెరువులు, 48 చెక్డ్యాంలు నిర్మిస్తున్నారు. జిల్లాలో 20 వేల వ్యవసాయ పంప్సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏటా వానకాలం, యాసంగిలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నది. రైతులు ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలను విక్రయించేందుకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నది. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతో రైతులు తమ పంటపొలాలకు ఉదయం, రాత్రి తేడా లేకుండా ఎప్పుడైనా పనులు చేసుకునే అవకాశం కలిగింది. అర్హులైన రైతులందరికీ రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను సర్కారు అందిస్తున్నది. దీంతో గతంలో రూ.5 లక్షలకు ఎకరం ధర పలికిన భూములు ప్రస్తుతం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతున్నా యి. ఉమ్మడి రాష్ట్రంలో అమ్ముదామంటే భూములు కొనేవారు లేకపోగా ఇప్పుడు సర్కారు అందిస్తున్న సాయంతో రెండు పం టలు సాగుచేస్తున్న రైతులు భూములను అమ్మడానికి ఇష్టపడడం లేదు.
రోడ్డు నిర్మాణంతో పెరిగిన ధరలు..
ప్రభుత్వం మూడేళ్ల కిందట కజ్జర్ల నుంచి రుయ్యాడి వరకు నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డును నిర్మించి వంతెన కట్టింది. గతంలో ఉన్న ఎడ్లబండ్ల రోడ్డు బీటీ రహదారిగా మారడంతో భూముల ధరలు బాగా పెరిగిపోయా యి. సర్కారు 24 గంటల ఉచిత విద్యుత్ను ఇవ్వడంతో పాటు, చెరువుల మరమ్మతులు చేపట్టడంతో భూగర్భజలాలు పెరగడంతో కరెంటు మోటర్లసాయంతో రెండు పంటలు పండిస్తున్నాను. దీంతో మా భూముల ధరలు మూడింతలు పెరిగాయి. – తలారి తిరుపతి, రైతు ,కజ్జర్ల, తలమడుగు