20కోట్లతో నిర్మాణం.. ఆధునిక వసతులు కల్పన
మంత్రి కేటీఆర్ ప్రత్యేక పర్యవేక్షణ
ఉద్యోగుల నియామకానికి ఉత్తర్వులు
పరికరాలు, మందులకు ఇండెంట్
త్వరలో అందుబాటులోకి సేవలు
ధార్మికక్షేత్రం వేములవాడలో అత్యాధునిక వసతులతో సర్కారు దవాఖాన రెడీ అవుతున్నది. 20కోట్ల వ్యయంతో తిప్పాపూర్లో నిర్మిస్తున్న ఈ వంద పడకల వైద్యశాల, చివరి దశకు చేరింది. మంత్రి కేటీఆర్ పనులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండగా, తుది మెరుగులు అద్దుకుంటున్నది. 81మంది వైద్యులు, ఇతర విభాగాల ఉద్యోగుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేయగా, ఇప్పటికే వైద్యుల నియామకం దాదాపుగా పూర్తయింది. త్వరలోనే ప్రారంభించనుండగా, వేములవాడ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడనున్నది.
వేములవాడ, మే 1: వేములవాడ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో ఉన్న నాలుగున్నర ఎకరాల స్థలంలో వంద పడకల దవాఖాన నిర్మించారు. జీ-ప్లస్1తో దాదాపు 79వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణమైంది. వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బందికి కూడా వసతి సముదాయాలను త్వరలో నిర్మించనున్నారు. వేములవాడ పట్టణంతోపాటు మధ్యమానేరు ముంపునకు గురైన ఆరు గ్రామాల ప్రజలకు ఈ దవాఖాన చేరువ కానున్నది. ఇక జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారిలోనే ఈ వైద్యశాల ఉన్నది.
ఆధునిక వైద్య సదుపాయాలు..
వేములవాడ ప్రాంత ప్రజల సౌకర్యార్థం అత్యాధునిక వసతులతో పెద్దాసుపత్రిని నిర్మించేందుకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు కృషి చేశారు. ఆ మేరకు దవాఖానను నిర్మిస్తున్నారు. అందులో అత్యాధునిక వసతులను సమకూర్చనున్నారు. అత్యవసర వార్డు, ఆపరేషన్ థియేటర్లు, గుండె పరీక్షల నిర్ధారణ, ఎక్స్రే, బ్లడ్బ్యాంక్, ల్యాబ్, మందుల దుకాణంతోపాటు ఆరోగ్యమిత్ర, ఆయూష్ ఆరోగ్యశ్రీ లాంటి సదుపాయాలతో కూ డిన ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయనున్నారు. స్త్రీ వైద్య నిపుణురాలు, ఎముకల వైద్యులు, చెవి, ముక్కు, గొంతు, గుండె జబ్బుల వైద్యులు, చిన్న పిల్లల వైద్యులతో పాటు అవసరమయ్యే అన్ని రకాల వైద్యులు కూడా అందుబాటులో ఉండనున్నారు. అంబులెన్స్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మార్చురీ గదిని కూడా నిర్మించారు.
మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ..
దవాఖాన నిర్మాణ పనులను గత నెలలో మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు. ప్రస్తుత కరోనా పరిస్థితు ల నేపథ్యంలో పనుల్లో వేగం పెంచడమే కాకుం డా కలెక్టర్ కృష్ణభాస్కర్, వైద్యాధికారి మహేశ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. నిర్మాణ పనులు, విద్యుత్ పనులు పూర్తయినట్లు సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. వైద్యుల నియామకం కూడా పూర్తి కావచ్చింది. దవాఖానకు అవసరమైన వైద్య పరికరాలు, మందులు కూడా ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు.
పరికరాలకు ఇండెంట్ పెట్టాం…
దవాఖాన నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. మూడు, నాలుగు రోజుల్లో పనులు పూర్తవుతున్నందున ఇప్పటికే అవసరమైన వైద్య పరికరాలు, మందుల కోసం ఇండెంట్ పెట్టాం. వీలైనంత త్వరగా దవాఖానాను ప్రారంభించాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్, కలెక్టర్ కృష్ణభాస్కర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
-మహేశ్రావు, వైద్యాధికారి (వేములవాడ)