ప్రతి మండలానికి క్రీడా మైదానం
తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధి
రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి
మనోహరాబాద్, ఏప్రిల్ 12: యువకులు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, పుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముప్పిరెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఫిబ్రవరి 24న మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పోటీల్లో 6 జిల్లాల నుంచి 80 జట్లు పాల్గొనగా, సోమవారం ముప్పిరెడ్డిపల్లి టీం, ఉప్పల్ టీంలు ఫైనల్లో తలపడ్డాయి. హోరాహోరీగా కొనసాగిన ఈ మ్యాచ్లో ఉప్పల్ టీం ఘనవిజయం సాధించింది. వీరికి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి బహుమతులు, రూ.20 వేల ఫ్రైజ్మనీని బహూకరించగా, రన్నర్ కప్గా నిలిచిన ముప్పిరెడ్డిపల్లి టీంకు బహుమతితో పాటు రూ.10 వేల ఫ్రైజ్మని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటికి నిరుత్సాహపడకుండా మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, త్వరలోనే ప్రతి మండలానికి స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కాళేశ్వరంతో రైతుల నీటి కష్టాలు దూరమవుతున్నాయన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాల్లో గోదావరి పరవళ్లు తొక్కుతుందని, త్వరలోనే ఉస్మాన్సాగర్, గండిపేట మీదుగా మూసీ నది ద్వారా నల్గొండ వరకు పారనున్నాయన్నారు. రూ.4 వేల కోట్లతో మూసీనదిపై 22 చెక్డ్యాంలు, వంద ఫీట్ల రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఎంపీపీ పురం నవనీతరవి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ నరాల ప్రభావతిపెంటయ్య, యువకులు పాల్గొన్నారు.