కరోనా బాధితులను కంటికిరెప్పలా చూసుకుంటాం
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత.. దానిని మరువం
దవాఖానల్లో సౌకర్యాలకు లోటు లేదు
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
ఎంజీఎం కొవిడ్ వార్డులో ఆకస్మిక తనిఖీ
పీపీఈ కిట్ ధరించి పరిశీలన
రోగులకు మనోధైర్యాన్నిచ్చిన అమాత్యుడు
రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు ఇబ్బందుల్లేకుండా చూడాలని మంత్రి ఈటలకు ఫోన్
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 28 : ‘భయం వద్దు.. కరోనాకు ధైర్యమే మందు.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత.. అది మరువం.. కొవిడ్ బాధితులను కంటికి రెప్పలా చూసుకుంటా’మని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభయమిచ్చారు. వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ వార్డును బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీపీఈ కిట్ ధరించి సుమారు గంట పాటు వసతులను పరిశీలించి రోగులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. సర్కారు దవాఖానల్లో సౌకర్యాలకు ఎలాంటి లోటు లేదని స్పష్టం చేసిన అమాత్యుడు, కరోనా సోకిన వారిని కాపాడేందుకు శక్తికొద్దీ పనిచేయాలని వైద్యులను కోరారు.
కరోనా బారినపడిన వారి కోసం ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఎలాంటి భయం వద్దని ధైర్యంగా ఉండాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. బుధవారం వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్-19 వార్డును ఆయన పీపీఈ కిట్ ధరించి ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి వసతులను పరిశీలించి, రోగులతో మా ట్లాడి అందుతున్న సేవలను, పౌష్టికాహారం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా బాధితులతో మాట్లాడి వారి లో మనోధైర్యం నింపారు. అలా గే రోగులకు అందిస్తున్న మందులు, వాటి నిల్వల వివరాలపై ఆరా తీశారు. కరోనాతో వచ్చిన వారిని కాపాడేందుకు శక్తికొద్దీ పనిచేయాలని వైద్యులను కోరారు. బాధితులు లేనిపోని అనుమానాలు, భయాలతో ఎంజీ ఎం వైద్యంపై నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు. కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో పూర్తిస్థాయి మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బుధవారం నుంచి ఎంజీఎంలో 800 పడకలతో కొవిడ్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, పడకలు ఆక్సిజన్ 650 ఉన్నాయని, ఆసుపత్రి ఆవసరాలకు తగినంత నిల్వలు ఉన్నట్లు మంత్రి చెప్పారు.
రెమ్డెసివిర్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూ డాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో ఫోన్లో కోరారు. కొవిడ్ బాధితులు ప్రైవేట్ హాస్పిటళ్ల చుట్టూ తిరిగి చివరి నిమిషంలో ఎంజీఎంకు రావడం వల్లే మరణాల రేటు ఎక్కువగా నమోదవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో తగిన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మే నెల నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే సరైన మార్గమని అన్నారు. ఎంజీఎంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందిని మంత్రి అభినందించారు. కరోనా వార్డును మంత్రి ఎర్ర బెల్లి సందర్శించిన సమయంలో ఆయన వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు.