పీహెచ్సీల్లో టీకా వేయించుకున్న మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎంపీపీ భీమమ్మ, అధికారులు
కల్వకుర్తి, ఏప్రిల్ 22: ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పిలుపునిచ్చారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో మున్సిపల్ చైర్మన్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి ఏకైక మార్గం వ్యాక్సిన్ వేయించుకోవడమేనన్నారు. వ్యాక్సిన్పై అనవసర అపోహలు పెంచుకోవద్దని సూచించారు. చైర్మన్తోపాటు పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, కౌన్సిలర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
వ్యాక్సిన్పై అపోహలొద్దు
చారకొండ, ఏప్రిల్ 22: కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వీడి ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని ఎంపీడీవో జయసుధ పేర్కొన్నారు. గురువారం పీహెచ్సీలో ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం 55 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి రూప తెలిపారు. కార్యక్రమంలో వైద్య విస్తరణ అధికారి చారి, ఏఎన్ఎం అలివేలు, కల్పన, శకుంతల, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
వంగూరు, ఏప్రిల్ 22: గ్రామాల్లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీపీ భీమమ్మ అన్నారు. గురువారం పీహెచ్సీలో ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్పై అపోహలు వీడి ప్రతిఒక్కరూ తీసుకోవాలన్నారు. కరోనాపై అప్రమత్తంగా ఉండి భౌతికదూరంతోపాటు మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో యాదవసంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
180 మందికి టీకాలు
తిమ్మాజిపేట, ఏప్రిల్ 22: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 180 మందికి కొవిడ్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా 83 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. పుల్లగిరిలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా సోకిందన్నారు. హనుమాన్ తండా పరిధిలోని చెన్నంగి తండాకు చెందిన ఏడాది చిన్నారికి వైరస్ సోకింది. తండాల్లో కేసులు పెరుగుతుండటంతో వైద్యసిబ్బంది తండాల్లో శానిటైజేషన్ చేయడంతోపాటు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
139మందికి కరోనా టీకాలు
తాడూరు, ఏప్రిల్ 22: తాడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 139మందికి కరోనా టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలో 45ఏండ్లు దాటిన ప్రతిఒక్కరికీ టీకా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ వంద నుంచి 140 మంది వరకు టీకా వేయించుకునేందుకు వస్తున్నారన్నారు.