3736మందితో పటిష్ట బందోబస్తు..
కార్పొరేషన్ పరిధిలో 878 కేంద్రాలు
ప్రలోభాలకు గురిచేస్తే పోలీస్ వాట్సాప్ 9491089257కు సమాచారం ఇవ్వండి
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ తరుణ్జోషి
హన్మకొండ సిటీ, ఏప్రిల్ 28 : ఈ నెల 30న జరిగే ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామనిప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. బుధవారం పోలీస్ కమిషనర్ సీపీ తరుణ్జోషితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లో పరిధిలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశామన్నారు. వీటిలో 357 సాధారణ, సమస్యాత్మకమైనవి 195, అతి సమస్మాత్మకమైనవి 159, 167 క్రిటికల్ స్టేషన్లుగా గుర్తించామని తెలిపారు. ప్రతి స్టేషన్లో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఒక్కో చోట సుమారు 800మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లుచేశామని తెలిపారు. అర్బన్తో పాటు రూరల్, జనగామ జిల్లాల నుంచి సుమారు 5300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికల సామగ్రిని హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నిట్ కళాశాల నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్నామన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలను 37 సెక్టార్లుగా విభజించి 44 రూట్లలో మొబైల్ పార్టీలు, 31 స్ట్రైకింగ్ ఫోర్స్, 4 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 5 చెక్పోస్టులతో నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి గ్రేటర్ పరిధిలో రూ.2,07,807 విలువ చేసే మద్యం, రూ 3 లక్షల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. 244మందిని బైండోవర్ చేసి 101 లైసెన్స్డ్ తుపాకులను తమ ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు.
పటిష్టమైన నిఘా : సీపీ తరుణ్జోషి
పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిఘా పెట్టినట్లు పోలీస్ కమిషనర్ తరుణ్జోషి తెలిపారు. కార్పొరేషన్లోని 14 పోలీస్స్టేషన్ల పరిధిలోని అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. 3,736మంది పోలీస్ సిబ్బంది విధుల్లో నిర్వర్తిస్తున్నారని చెప్పారు. కమిషనరేట్తో పాటు ఉమ్మడి జిల్లా సిబ్బంది, ఖమ్మం కమిషనరేట్, టీఎస్ఎస్పీ బెటాలియన్ సిబ్బంది, 3 ఫ్లాటూన్లను బందోబస్తు విధులకు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 10 స్టాటిక్ సర్వేలైన్స్, 12 ఫ్లయింగ్ స్కాడ్స్, 8 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. అలాగే పోలింగ్ ఏరియాలో పికెటింగ్, పెట్రోలింగ్ సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు రోజు గెలిచిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు అనుమతి ఉందని, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే పోలీస్ వాట్సాప్ నెంబర్ 94910-89257కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ రోజు సాయంత్రం 5గంటల వరకు, కౌంటింగ్ రోజు ఉదయం 6గంటల నుంచి ఫలితాలు వచ్చే దాకా మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ పుష్ప పాల్గొన్నారు.