ఖమ్మం సర్కారు దవాఖానలో రోగులకు రెండు పూటలా భోజనం
గర్భిణులు, బాలింతలు, రోగులకు పౌష్టికాహారం
కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు
ఖమ్మం సిటీ, మార్చి 15 : ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఊరెళ్లినా ఇదే పాట వినిపించేది. ‘పురుగులు పడిన బియ్యంతో వండిన అన్నం.. పప్పులేని ఉప్పుచారు.. నీళ్లను తలపించే మజ్జిగ’.. ఇదీ ఉమ్మడి పాలనలో ఖమ్మం పెద్దాసుపత్రిలో రోగులకు పెట్టిన భోజనం. కానీ, తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నది. రోగులకు మెరుగైన వైద్యంతోపాటు ఉదయం టిఫిన్, రెండు పూటలా భోజనం పెడుతున్నది. రోగులు, గర్భిణులు, బాలింతలకు విటమిన్స్, రక్తప్రసరణకు ఉపయోగపడే పల్లీ పట్టీలు, పోషకాహారం ఆహారం అందజేస్తుండడంతో రోజురోజుకూ ఇన్, అవుట్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతున్నది. ఖమ్మం పెద్దాసుపత్రిలో వైద్యసేవలు, భోజన వసతిపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
ఖమ్మం పెద్దాసుపత్రిలో రోజు వేలల్లో అవుట్ పేషెంట్స్, వందల్లో ఇన్ పేషెంట్స్ వస్తుంటారు. మునుపెన్నడూ లేని విధంగా సర్కారు దవాఖానలో వారికి వైద్యసేవలు, రుచికరమైన భోజన వసతి కల్పిస్తుండడంతో ముగ్ధులవుతున్న రోగులు సీఎం కేసీఆర్కు నీరాజనాలు పలుకుతున్నారు.
సాదాసీదా భోజనం కాదు..
‘పురుగులు పడిన బియ్యంతో వండిన అన్నం.. పప్పులేని ఉప్పుచారు.. నీళ్లను తలపించే మజ్జిగ’.. ఇదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఖమ్మం పెద్దాసుపత్రిలో రోగులకు పెట్టిన భోజనం. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వైద్యరంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రోగులకు అందించే భోజనానికి సంబంధించిన మెనూ సవరించారు. ఉదయం రకరకాల టిఫిన్స్ (ఉప్మా, ఇడ్లీ, కిచిడీ), మధ్యాహ్నం రుచికరమైన భోజనం (అన్నం, పప్పు, ఒక కూర, సాంబారు, మజ్జిగ, గుడ్డు, అరటి పండు) పెడుతున్నారు. రాత్రిపూట కూడా అన్నం, పప్పు, రసం, మజ్జిగ, గుడ్డు వడ్డిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు విటమిన్స్, రక్తప్రసరణకు ఉపయోగపడే పల్లీల పట్టి ఇస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రస్తుతం అన్సీజన్ అయినా రోజుకు 350 నుంచి 400 వరకు ఇన్ పేషెంట్స్గా ఉంటున్నారు. సీజన్లో అయితే వారి సంఖ్య 1000 దాటుతుంది. రోగులు ఎంతమంది చేరినా వారికి నాణ్యతతో కూడిన భోజనాన్ని వడ్డిస్తున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, డైటీషియన్ మేరి, గుత్తేదారు తక్కెళ్లపాటి నర్సింహారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు.. తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడే మనిషోయ్’.. అన్నారు మహాకవి గురజాడ అప్పారావు.. ఒకటి సామెత, మరొకటి కవిత కావచ్చు. కానీ.. ఆ రెండింటినీ పోల్చిచూస్తే ఆహారంతోనే ఆరోగ్యం అనేది అవగతమవుతున్నది. అందుకే కాబోలు.. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు పండంటి భోజనాన్ని పెడుతున్నారు. ఇన్ పేషెంట్స్కు మూడు పూటలా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా మెనూ ప్రకారం కడుపు నింపుతున్నారు. భోజనంతోపాటు దవాఖానకు వచ్చిన వారికి కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అందిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు.
కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు..
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాట ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఊరు వెళ్లినా వినిపించేది. ఇప్పుడా భయం లేకుండా చేసింది తెలంగాణ సర్కారు. ప్రభుత్వ హాస్పిటల్స్ను ఆహ్లాదానికి ప్రతీకలుగా తీర్చిదిద్ది, ఊహించని రీతిలో మౌలిక వసతులు కల్పించింది. రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు, ఇతర విభాగాల సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తూ కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు చేర్చింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జర్వం, ఇతర సీజనల్ వ్యాధులతోపాటు జనరల్ సర్జరీస్, గైనకాలజీ, పిడియాట్రిక్, ఆర్థ్ధోపెడిక్, ఆఫ్తమాలజీ, డయాలసిస్, టీబీ వంటి కీలక రోగాలకు తిరుగులేని సేవలు అందుతున్నాయి. అన్నిరకాల రక్త, మలమూత్ర పరీక్షలు, ఐసీయూ, స్కానింగ్, ఎక్స్రే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. నయాపైసా ఖర్చులేకుండా వైద్యులంతా సమష్టిగా పనిచేస్తూ మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. దీంతో రోజుకు 1000 నుంచి 1500 వరకు ఓపీ (అవుట్ పేషెంట్స్) నమోదవుతున్నది. సీజన్లో రోగుల సంఖ్య 2 వేల నుంచి 3 వేలు దాటుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే రోగులకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తున్నామని యంత్రాంగం స్పష్టం చేస్తున్నది.