బేల, మార్చి 15 : నిరుపేదలందరికీ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని మసాలా(బీ) గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సోమవారం మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బేల మండలంలోని ప్రతి తండా, గూడేల్లో ఉన్న నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. మండలంలో ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడం లేదని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. మసాలా(బీ) గ్రామంలో 120 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుచేసినట్లు చెప్పారు. మిగతా వారికి దశలవారీగా మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మండల అభివృద్ధికి ముఖ్య మంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు మంజూ రుచేశారన్నారు. దీంతో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించాలని సర్పంచ్లకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల తరువాత కొత్త జీవో ప్రకారం సొంత స్థలాలు ఉన్నవారికి ఇండ్లు మంజూరుచేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు బండి సుదర్శన్, మంగేశ్ ఠాక్రే, సతీశ్ పవార్, మస్కే తేజ్రావు ఇంద్రశేఖర్, వాడకర్ తేజ్రావు, విపిన్, సంతోష్ బెదుల్కర్, బత్తుల సుధాం, బండి నందు, మండల ప్రత్యేకాధికారి శంకర్, డిప్యూటీ డీఈ పీఆర్ రఫత్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.