ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 30: సీఎం కేసీఆర్ పట్టుదలతో చేపట్టిన సాగునీటి వనరుల పునరుద్ధరణ, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో అన్నదాతలకు ఉజ్వల భవిష్యత్తు నెలకొందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. మండలంలోని సెర్ప్ కార్యాలయంలో మహిళా ఉత్పత్తదారుల సంఘాలకు ప్రభుత్వం సమకూర్చిన సామగ్రిని శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్తో కలిసి మహిళలకు మార్కెటింగ్ ధృవపత్రాలు, సామగ్రి పంపిణీ చేశారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
మండలంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పొదుపు సంఘాల మహిళలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. సెర్ప్ ఉద్యోగులు, వీవోఏలకు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.12 వేల కోట్లు కేటాయించి తక్షణమే అందులోంచి రూ.3 వేల కోట్లు విడుదల చేయడాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్నాయక్, రైతుబంధు సమితి రాష్ట్ర సలహాదారు మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ ప్రమోద్, కో ఆప్షన్ సభ్యుడు గాజీ, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీవో అరుణ్గౌడ్, ఏపీఎం దుర్గారావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రేణుక, సత్యనారాయణ, శ్యాం పాల్గొన్నారు.