స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
గోదావరి జలాలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పూజలు
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 22 : గోదావరి జలాలను మంజీరలో కలుపడం.. తల్లిని తెచ్చి బిడ్డకు అప్పగించినట్లు ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. గురువారం నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి జలాలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పోచారం పూజలు చేశారు. గంగమ్మకు సారెను సమర్పించారు.
గోదారి తల్లిని తీసుకొచ్చి ఉపననది అయిన మంజీరకు అప్పగించామని, సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలోచనతో నిజాంసాగర్ ఆయకట్టు పూర్వవైభవం సంతరించుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కొండపోచమ్మ ద్వారా వదిలిన గోదావరి జలాలు గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని వెంకంపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ… గోదావరి జలాలు రప్పించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికే ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు.
1932లో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 2.72 లక్షల ఎకరాలకు నీరందించారన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలతో నిజాంసాగర్ ఎండిపోయిందని వాపోయారు. రెండు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి గోదారి జలాలు నిజాంసాగర్లోకి తేవడం గొప్ప కార్యం అన్నారు. గోదావరి నీళ్లు కొండపోచమ్మ ద్వారా నిజాంసాగర్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. నిజాంసాగర్లో ఉన్న 6.4 టీఎంసీల నీటిలోకి ఇంకా 6 టీఎంసీల నీరు తెచ్చి నిజాంసాగర్ను జల నదిగా చేస్తామన్నారు. భువి నుంచి నీటిని 600 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ ద్వారా నిజాంసాగర్కు నీటిని మళ్లిస్తున్నామన్నారు. రైతులు పంట సమయాన్ని మార్చుకోవాలన్నారు. కోటీ 50 లక్షల ఎకరాలకు నీరందించడమే కేసీఆర్ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలోఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
కంటతడి పెట్టుకున్న స్పీకర్ ..
నాగిరెడ్డిపేట్ మండలానికి చేరుకున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ పోచారం గతాన్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు ఎంతో కష్టాలను అనుభవించారని, ఎంత మొత్తుకున్నా చుక్కనీరు ఇచ్చేవారు కాదన్నారు. తెలంగాణ వచ్చాక దర్జాగా నీటిని తెచ్చి ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
మూడేండ్లలోనే..
30 సంవత్సరాల ప్రాజెక్టును కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత కేసీఆర్దే అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కొండపోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీరలోకి గోదావరి జలాలు తరలివచ్చాయన్నారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఉప నదిలోకి అతి పెద్ద గోదావరి కలవడం చరిత్రలోనే అద్భుత ఘట్టం అని తెలిపారు.
మూడేండ్లల్లోనే..
30 ఏండ్ల ప్రాజెక్టును కేవలం మూడేండ్లలోనే పూర్తి చేశాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలం వల్లే ఇది సాధ్యమైంది. ఉప నదిలోకి అతి పెద్ద గోదావరి కలవడం చరిత్రలోనే అద్భుత ఘట్టం.
-మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఇవి కూడా చదవండి
కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ షురూ.. రోడ్లు ఖాళీ