రేగా విష్ణు ట్రస్టు ఆధ్వర్యంలో మెటీరియల్ పంపిణీ
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు/ మణుగూరు రూరల్, ఏప్రిల్ 28: మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ప్రోత్సాహం అందజేస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్కు దరఖాస్తు చేసుకున్న 100 మంది అభ్యర్థులకు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను రేగా విష్ణు మోమెరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఈ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ కారం విజయకుమారి, రేగా విష్ణు ట్రస్టు సెక్రటరీ చందా హరికృష్ణ, పీఏసీఎస్ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు అడపా అప్పారావు. తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ఎం.సాగర్ యాదవ్, ప్రభుదాసు, జావీద్పాషా, రవి, రవిప్రసాద్, ముద్దంగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ సేవలు స్ఫూర్తిదాయకం
నిజాం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిన వీర వనిత చాకలి ఐలమ్మ సేవలు ప్రస్తుత సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పీవీకాలనీ క్రాస్రోడ్ సమీపంలో మణుగూరు రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. రజక సంఘం మండల అధ్యక్షుడు ధర్మరాజుల శంకరయ్య, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.