సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, ఆరోగ్య లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, చేప పిల్లలు, గొర్రెల పంపిణీ..
నిత్యావసరాలు, చమురు ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంపై కేంద్రంపై సర్వత్రా విమర్శలు
రంగారెడ్డి, మార్చి 13, (నమస్తే తెలంగాణ): ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా ధరలు పెంచి సామాన్యుడిపై మోపిన భారాన్ని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పట్టభద్రులు పోల్చి చూసుకుంటున్నారు. ఇదే విషయంపై విస్తృతంగా చర్చించుకొని తమ సంక్షేమం కోసం పనిచేస్తున్న వారికే పట్టం కట్టాలనే దిశగా యోచిస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నది. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. ఈ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తుండడం గమనార్హం. కాగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకవైపు వంటనూనెలు, మరోవైపు పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుడి బతుకు భారంగా మార్చడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. దీంతో ధరల పోటుకు ఓటుతో బుద్ధి చెబుతామని, తమ సంక్షేమం కోసం పని చేస్తున్న వారిని ఆదరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నది. ఆరున్నరేండ్లుగా దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నది. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నది. ఈ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తుండడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో ప్రగతి సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కరోనా లాక్డౌన్తో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ ఏ ఒక్క పథకానికి ఆటంకం కలుగకుండా నిధులు విడుదల చేసింది.
అసత్యాల బీజేపీ..
మరోవైపు ప్రతి ఎన్నికల్లో ప్రజల సెంటిమెంట్ ఎజెండాతో వెళ్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అదే సెంటిమెంట్, అసత్య ప్రచారాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకెళ్తున్నది. ఓ వైపు నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తూ.. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటుపరం చేస్తూ బడుగు, బలహీన వర్గాలకు భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాల అమలుకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం వంట నూనె, వంట గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజానీకం జీవితాలను అగాథంలోకి నెట్టివేస్తున్నదని పట్టభద్రులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం వైపు నిలుస్తారా, సంక్షోభం వైపు నిలుస్తారా.. అని ఆలోచించి ఓటేయాలని తెలంగాణ యువత సూచిస్తున్నది. అయితే జిల్లాలోని పట్టభద్రులు మాత్రం సంక్షేమానికి తమ మద్దతు అని ప్రకటిస్తుండడం గమనార్హం.
సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట..
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ప్రధానంగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి బడ్జెట్లో రూ.వేల కోట్లను కేటాయిస్తున్నది. గతంలో రోజుకు మూడు గంటల విద్యుత్ సరఫరాను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నది. రైతులు అప్పుల బారిన పడకుండా పంట పెట్టుబడి నిమిత్తం ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. రైతు మృతి చెందితే రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. మరోవైపు మరుగునపడిన కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు. గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నది. గతంలో వేసవి వస్తే చాలు కిలోమీటర్ల మేర వ్యవసాయ బావులు, బోర్ల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాలను వేసి తాగునీటిని సరఫరా చేస్తున్నది. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ దవాఖానలను బలోపేతం దిశగా కేసీఆర్ కిట్లు తదితర పథకాలను అందిస్తున్నది. ఇలా ఆరున్నరేండ్లలో టీఆర్ఎస్ సర్కార్ రూ.లక్షల కోట్లను వెచ్చిస్తూ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మరోవైపు లక్షా 32వేల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.
సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీ..
కేంద్రం ప్రభుత్వం దేశాన్ని సంక్షోభంలో నెట్టివేస్తున్నది. వంట నూనె, వంట గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నది. బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లను కాలరాసేలా విధానాలను బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నది. దేశంలో 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేశామని బీజేపీ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. రూ.90 ఉన్న వంట నూనెను కేవలం రెండు, మూడు నెలల్లోనే రూ.150కి, పెట్రోల్ ధర దాదాపు రూ.100కు, వంట గ్యాస్ను రూ.871కి పెంచి సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపింది. కేంద్ర ప్రభుత్వ తీరుతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ప్రజా సంక్షేమాన్ని మరిచి కేవలం సెంటిమెంట్తోనే ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని పట్టభద్రులు స్పష్టం చేస్తున్నారు.