-వనస్థలిపురం రైతుబజార్లో అమ్మకాలు
-రోజుకు వెయ్యి కిలోల విక్రయాలు
ఇటీవల నగరంలోని రైతుబజారుల్లో ప్రారంభించిన సబ్సిడీ ఉల్లి కేంద్రాలకు భారీ స్పందన లభిస్తోంది. సామాన్యులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో అందరికీ అందేలా ఆధార్ కార్డును నమోదు చేసుకుని రూ.40కి కిలో చొప్పున రోజుకు వెయ్యి కిలోలు విక్రయిస్తున్నారు. అయితే ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు విక్రయ కేంద్రాలు పని చేస్తున్నాయి.
వనస్థలిపురం: భారీగా ధర పెరిగి కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిగడ్డ అమ్మకాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వనస్థలిపురం రైతుబజార్లో ప్రారంభించిన సబ్సిడీ ఉల్లి కేంద్రానికి భారీ స్పందన లభిస్తోంది. వనస్థలిపురంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఉల్లి కొనుగోలుకు ఇక్కడికి వస్తున్నారు. దీంతో రోజుకు సగటున పది క్వింటాళ్ల వరకు విక్రయిస్తున్నట్లు రైతు బజార్ సిబ్బంది తెలిపారు. మార్కెట్లో భారీగా పెరిగిన ఉల్లి ధరకు కళ్లెం వేయడంతోపాటు, సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రా లను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డ రూ.80నుంచి 100కు అమ్ముతున్నారు. సబ్సిడీపై రైతుబజార్లో రూ.40కి కిలో చొప్పున అందిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు విక్రయ కేంద్రం పనిచేస్తుంది. కేంద్రాన్ని ప్రారంభించి ఐదురోజులు అవుతుండగా ఇప్పటికే 50 క్వింటాళ్లు ఉల్లిని సరఫరా చేశారు. కుటుంబానికి ఒక్క కిలో చొప్పున తీసుకోవాలని వ్యాపారస్తులకు విక్రయించేది లేదని తెలిపారు. కాగా ధరలు పెరిగినపుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్పందన అపూర్వం
సబ్సిడీ ఉల్లి కేంద్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తుంది. రైతు బజార్కు మధ్యాహ్నం ఉల్లి వస్తుంది. కాగా అందరికీ అనువైన సమయంలో విక్రయించాలని సాయం త్రం 4నుంచి 7గంటల వరకు సరఫరా చేస్తున్నాం. ఆధార్ కార్డును నమోదు చేసుకుని తీసుకోవాలి. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాణిజ్య అవసరాలకు సరఫరా చేయం .- స్వప్న, రైతు బజార్ ఎస్టేట్ అధికారి
సామాన్యులకు ఊరట
సబ్సిడీ ఉల్లి కేంద్రంతో సామాన్యులకు ఊరట లభించింది. హఠాత్తుగా ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో సబ్జిడీపై ఇవ్వ డం అభినంద నీయం. కేంద్రం ఉదయం నుంచి సాయం త్రం వరకు కొనసాగేలా చూడాలి. మిగతా కూరగాయ ధర లు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.- సుంకరి ధనలక్ష్మి, గృహిణి