గోదావరిఖని, నమస్తే తెలంగాణ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్న సంస్థ, కోల్బెల్ట్ ప్రాంతాభివృద్ధికి తనవంతు సహకారం అందించాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి అధ్యక్షతన కోల్బెల్ట్ ఏరియా ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన హామీలపై సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ప్రజాప్రతినిధులు హర్షం ప్రకటిస్తూనే, మరికొన్ని సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. వైద్య సౌకర్యం పెంపుదల, సమీప గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు మరిన్ని నిధుల కేటాయింపు, మరింత విస్తృతంగా కారుణ్య నియమాల ప్రక్రియ అమలు వంటి సూచనలు చేశారు. సీఎం ఇప్పటికే సింగరేణి ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి ఇండ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవడం హర్షనీయమనీని, ఇంకా మిగిలి ఉన్న భూములను ప్రభుత్వానికి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ అంశాలతో పాటు సింగరేణి ఇప్పటి వరకు అమలు జరిపిన సంక్షేమ కార్యక్రమాలు సమీప గ్రామాల అభివృద్ధికి చేపట్టిన చర్యలను పీపీటీ ద్వారా డైరెక్టర్ పా వివరించారు. సింగరేణి ప్రాంత జిల్లాల అభివృద్ధికి కేటాయించిన రూ. 2000 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
వీటికి అదనంగా ప్రతీ నియోజక వర్గానికి రూ. 2 కోట్ల సీఎస్ఆర్ నిధులు కూడా కేటాయించాలని ప్రజాప్రతినిధులు చేసిన సూచనపై సీఎండీ శ్రీధర్ సానుకూలంగా స్పం దిస్తూ ప్రతిపాదన సమర్పించాలన్నారు. సీఎండీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సూచించిన సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఆవిర్బావం తర్వాత సాధించిన వృద్ధిని, అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ విషయాలలో సింగరేణి దేశంలోనే నెంబర్ వన్లో ఉందని పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో చేపట్టనున్న కొత్త గనులు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ సింగరేణి విస్తరణకు, ప్రగతికి సహకరించాలని కోల్బెల్ట్ ప్రతినిధులను కోరా రు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, రేగ కాంతారావుతోపాటు ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్ రావు, కోరకంటి చందర్, గండ్ర వెంకట రమణా రెడ్డి, బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య, సింగరేణి డైరెక్టర్లు, అన్ని ఏరియాలు జీఎంలు, కార్పొరేట్లో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కారుణ్య నియమకాలు పూర్తి చేయాలి..
సింగరేణి గని కార్మికుల సంక్షేమమే తమ ధ్వేయమనీ, వారి వారసులకు వంద శాతం కారుణ్య నియామకాలు పూర్తి చేయేలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. హైదరాబాద్లో సింగరేణి సీఎండీ, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చందర్ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్న ఎమ్మెల్యే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గని కార్మికుల సమస్యలను విన్నపించారు. కారుణ్య నియమకాలకు రెండేళ్ల కాలపరిమితి ఇవ్వాలన్నారు. అలాగే, సింగరేణి ఆధ్వర్యంలో సీబీఎస్ఈ సిలబస్తో బోదించేలా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు ఏడు మీటర్ల రోడ్డును డ్రైనేజీల వరకు విస్తరించాలనీ, మునిస్పల్ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు ఇరువైపుల ఉన్న కాలం చెల్లిన సింగరేణి క్వార్టర్స్ను మున్సిపల్కు అప్పగించాలన్నారు. సింగరేణి ఏరియాలో దవాఖానలను సూపర్ స్పెషాలిటీ దవాఖానలుగా మార్చాలనీ, ప్రతి గనిపై ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు కావాలన్నారు. 2 ఇైంక్లెన్ బ్రిడ్జి నిర్మాణం, మనోచైతన్య ఆవుట్సోర్సింగ్ టీచర్స్ నియామకం, వృద్ధులకు డే కేర్ సెంటర్స్ ఏర్పాటు జరుగాలన్నారు. ఓసీపీ-4 మూసివేతతో ఓసీపీ-3లో లారీ యాజమానులకు ట్రాన్స్పోర్ట్ కోసం సీఎస్పీని ఏర్పాటు చేయ్యాలన్నారు.