నీలగిరి : జీవ వైవిద్య చట్టం ప్రకారం గ్రామ, మండలస్థాయి కమిటీలు రెండ్రోజుల్లోగా పూర్తి చేయాలని జడ్పీసీఈఓ కె.వీరబ్రహ్మచారి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవ వైవిద్య చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలన్నారు. జిల్లాలోని 4 మండలాల్లో కమిటీలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మండలాలు మూడ్రోజుల్లో వార్షిక లెక్కలు అందజేయాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన మండలాలు పాత మండలాల నుంచి ఫర్నీచర్ బడ్జెట్లను గ్రామ పంచాయతీల వారీగా కేటాయింపులు చేసుకుని రికార్డులు రాసుకుని జిల్లా పరిషత్కు కూడా పత్రాలను అందజేయాలన్నారు.
కొత్త, పాత మండలాలకు సంబంధించిన ఎస్ఎఫ్సీ, జనరల్ ఫండ్స్ వివరాలు కూడా రికార్డుగా రాయాలన్నారు. కొత్త మండలాలు సంబంధిత ఎస్టీవోలను సంప్రదించి డీడీఓ కోడ్ను, పీడీ అకౌంట్లను పొందాలని సూచించారు. సీఎం కేసీఆర్ గ్రామాల రూపురేఖలు మార్చడం కోసం తీసుకొచ్చిన 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలన్నారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న అభివృద్ది పనులను సమీక్షించారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ సీతాకుమారి, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.