Dussehra 2022 | దసరా పండుగకు పాలపిట్ట ( Indian roller alias palapitta )తో విడదీయరాని అనుబంధం ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్టకనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. అందుకే శమీ పూజ అనంతరం పాల పిట్టను చూసేందుకు ప్రజలు తహతహలాడుతారు. ప్రత్యేకించి ఊరి చివరకు, పొలాల మధ్యకు వెళ్లి మరి పాలపిట్ట కనిపిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. ఇంతకీ అసలు విజయ దశమి రోజు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి? దాని వెనుక ఉన్న కారణమేంటి? ఒకసారి చూద్దాం..
నీలం, పసుపు రంగుల కలబోతలో ఉండే పాలపిట్ట ( Indian roller – palapitta ) చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతుంటారు. అయితే ఈ నమ్మకం వెనుక పురాణగాథలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతా యుగంలో రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు విజయ దశమి రోజున పాలపిట్ట ఎదురుగా కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో పాలపిట్టను శుభశకునంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక అజ్ఞాత వాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణ గాథలు చెబుతున్నాయి.
అంతేకాదు పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళ్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చింది. అప్పటి నుంచి వారి కష్టాలు తొలగిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు. పాలపిట్ట కనిపించినప్పటి నుంచి పాండవులు ఏం చేసినా విజయాలే కలిగాయంట. అందుకే దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే విజయ దశమి రోజు సాయంత్రం జమ్మి పూజ తర్వాత ప్రజలు పాలపిట్ట దర్శనం కోసం ఊరి చివరకు, పంట పొలాలకు తండోపతండాలుగా వెళ్తుంటారు. పాలపిట్ట దర్శనం అనంతరం ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. అయితే పాల పిట్ట ఉత్తర దిక్కు నుంచి ఎదురైతే ఇంకా మంచిదని, శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. అదే దక్షిణం దిక్కు నుంచి వస్తే అశుభానికి సంకేతమని కూడా ప్రచారంలో ఉంది.
పురాణాలు, సాంస్కృతిక పరంగా పాలపిట్టకు ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే.. దీన్ని మన రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నాం. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టనే.
Dussehra | దసరా రోజు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?
పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?