శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా సామూహిక వరమహాలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం చంద్రవతి కళ్యాణమండపంలో ఉదయం 10 గంటలకు ఈవో కేఎస్ రామారావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 800 మందికి పైగా ముత్తైదువలు పాల్గొన్నారు. అర్చక వేదపండితులు తొలుతగా గణపతిపూజ, స్వామిఅమ్మవార్లను ఆశీనుజేసి వరలక్ష్మీ అమ్మవారి ఆవాహన కళశస్థాపనతో షోడశోపచార క్రతువులను జరిపించారు. అదే విధంగా వరమహాలక్ష్మి వ్రత పరోక్షసేవలో 435 మంది పాల్గొన్నారని ఆలయ అధికారులు తెలిపారు. వ్రతంలో పాల్గొన్నవారికి స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించి అమ్మవారి రవిక గాజులు శేషవస్త్రంగా అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.